వేస్ట్​ మేనేజ్​మెంట్​పై కిటాక్యూషుతో ఒప్పందం..మూసీ అభివృద్ధి, పునరుజ్జీవ ప్రాజెక్టుపై దృష్టి

వేస్ట్​ మేనేజ్​మెంట్​పై కిటాక్యూషుతో ఒప్పందం..మూసీ అభివృద్ధి, పునరుజ్జీవ ప్రాజెక్టుపై దృష్టి
  •  రాష్ట్ర భవిష్యత్​ను తీర్చిదిద్దేందుకే ...
  • వివిధ దేశాల భాగస్వామ్యంతోకొత్త ప్రాజెక్టులు: సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు వివిధ దేశాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపడుతూ తెలంగాణ పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టెక్యూచి నేతృత్వంలోని బృందంతో సీఎం సమావేశమయ్యారు. 

పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో కిటాక్యూషు సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గత ఏప్రిల్‌లో జపాన్ పర్యటన సమయంలో కిటాక్యూషు నగరాన్ని సీఎం సందర్శించి, మేయర్ కజుహిసా టెక్యూచితో సమావేశమై పర్యావరణ పరిరక్షణ కోసం పలు సంస్థలతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ కుదుర్చుకున్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జపాన్ పర్యటనలో కిటాక్యూషు ఎకో-టౌన్ మోడల్ చూసి ఎంతగానో  ప్రేరణ పొందానని, ఆ నమూనాను హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడానికి అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. 

సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, జీరో ఎమిషన్స్​, సిటీ ఇన్నవోషన్స్​లో ఈ సహకారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించిందని, తెలంగాణ యువతకు నైపుణ్యాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. జపాన్‌‌లో అవకాశాల కోసం విద్యార్థులు జపనీస్ భాష నేర్చుకోవాలని భావిస్తున్నారని, కిటాక్యూషు సహకారంతో ఔత్సాహికులకు జపనీస్ నేర్పించే ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు.

 కిటాక్యూషు నగర నాయకత్వాన్ని అభినందిస్తూ, రెండు ప్రాంతాల మధ్య స్నేహం సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.