వినిపించిన వాదనలే మళ్లీ మళ్లీ ఎందుకు?..గ్రూప్–1 కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వినిపించిన వాదనలే మళ్లీ మళ్లీ ఎందుకు?..గ్రూప్–1 కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  •  స్టే వెకెట్ చేయాలంటూ నాలుగు పిటిషన్లు
  •  విచారణ ఆలస్యమైతే అభ్యర్థులు ఇబ్బంది పడతారన్న న్యాయస్థానం
  • ఈ నెల 30న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని వెల్లడి


హైదరాబాద్‌: గ్రూప్‌1పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదిపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈసందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను లేట్ చేయొద్దని, దీని వల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని తెలిపింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గత నెలలోనే ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. పునర్‌మూల్యాంకనం చేయాలని లేదా మరోసారి మెయిన్స్‌ నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్‌ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ALSO READ | తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై సర్కార్ బడుల్లో నర్సరీ, LKG, UKG తరగతులు

 గ్రూప్‌-1 నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్‌-1 నియామకాలపై స్టే విధించింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయొచ్చని ఆదేశించింది. గ్రూప్‌-1 నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో అభ్యర్థులు వేర్వేరుగా 4 పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ విచారణ సందర్భంగా స్టే వెకెట్‌ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కౌంటరు దాఖలు చేయడానికి టీజీపీఎస్సీ, ఇతర న్యాయవాదులు సమయం కోరారు. విచారణను ఆలస్యం చేయొద్దని, దీని వల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. వినిపించిన వాదనలే మళ్లీ వినిపించొద్దని, ఈనెల 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.