బిల్డింగులు కాదు.. బతుకుదెరువు కావాలె

బిల్డింగులు కాదు.. బతుకుదెరువు కావాలె

హైదరాబాద్, వెలుగు:కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు రాష్ట్రవ్యాప్తంగా వసతులు కల్పించాలని, కరోనా నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు భవంతులు కాదు.. బతుకు దెరువు కావాలని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌‌‌‌కు వచ్చిన విరాళాల లెక్క బయటపెట్టాలని డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కరోనా, సెక్రటేరియట్ కూల్చివేతలపై మంగళవారం హైదర్‌‌‌‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌లోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఇంట్లో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ ఎంఎల్‌‌‌‌ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ హాజరయ్యారు.

తొలగించిన ఉద్యోగులను తీసుకోవాలి: కోదండరాం

కరోనాను సాకుగా చూపిస్తూ ప్రతిపక్షాలు నిరసన తెలపకుండా ప్రభుత్వం నిర్భంధాలకు పాల్పడుతోందని కోదండరాం మండిపడ్డారు. గన్ పార్క్ దగ్గర నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసంఘటిత కార్మికులు, చేతి వృత్తులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. నవంబర్ వరకు రూ. 7,500 ఆర్థిక సాయంతో పాటు ఫ్రీ రేషన్ ఇవ్వాలన్నారు. తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే తీసుకోవాలన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రకటించి పోరాడుతామని చెప్పారు.

ఇప్పుడు సెక్రటేరియట్‌‌‌‌ కట్టుడు అవసరమా?: రమణ

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అని రమణ ప్రశ్నించారు. ప్రగతి భవన్‌‌‌‌లో కరోనా వస్తే సీఎం ఫాంహౌస్‌‌‌‌కు పోయి విశ్రాంతి తీసుకున్నారని, ఇళ్లు లేని పేద ప్రజలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. సోమవారం కురిసిన వర్షానికి ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌లో వార్డులకు నీళ్లొచ్చాయని, ఆ హాస్పిటల్‌‌‌‌ను కొత్తగా కడతామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లో వసతుల్లేక డాక్టర్లు రాజీనామా చేస్తున్నారని చెప్పారు.

నిరసన తెలిపే పరిస్థితి కూడా లేదు: చాడ

కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సంపత్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లో వసతుల్లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే పరిస్థితి కూడా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుపై వర్చువల్ ర్యాలీలు, రచ్చబండ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఉద్యమం చేపడుతామని చాడ
వెల్లడించారు.