- డాక్టర్ శివప్రసాద్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆయుష్ ఇంటర్నీలు, పీజీ వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంచాలని తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ డిమాండ్ చేశారు. స్టైపెండ్ పెంపు కోసం ఆయుష్ వైద్య విద్యార్థులు సమ్మె బాట పట్టి 10 రోజులు పూర్తయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని సుమారు 40 వేల మంది ఆయుష్ వైద్యుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఇతర వైద్య విద్యార్థులతో సమానంగా పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
