హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం జిల్లాల్లో భానులు నిప్పులు కురిపించనున్నాడు. మే 12న ఖమ్మం, ఉమ్మడి నల్గొండ మినహా మిగతా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎండ తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఎండలు, వడగాల్పులు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. తీవ్రమైన జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, కండరాలు పట్టేయడం, వేగంగా గుండె కొట్టుకోవడం, ఊపిరి ఆడకపోవడం వడదెబ్బ లక్షణాలని, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని, లేదంటే108 కి ఫోన్ చేసి దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లాలని పేర్కొంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
