హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున.. డిమాండ్ల పరిష్కారంపై ఏం చేయాలనే దానిపైనా మంత్రివర్గంలో చర్చిస్తారు. మెట్రో టేకోవర్కు సంబంధించి రూ.13 వేల కోట్లకు రుణం మంజూరు కాగా.. ఈ నెలాఖరు కల్లా పూర్తిగా ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోవడంపై కేబినెట్గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, భూముల మార్కెట్వాల్యూ సవరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్రావుతో పాటు పలువురు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న కోర్టు తీర్పుపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఇప్పటికే న్యాయ నిపుణుల అభిప్రాయం కోరారు. కేబినెట్లో దానిపై చర్చించనున్నారు. హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కు వెళ్లడం.. లేదా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇంకోవైపు ఏదైతే ప్రొసిజర్ ల్యాప్స్ ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించిందో దానికి సంబంధించి మళ్లీ కమిషన్ను పునరుద్ధరించి సరి చేయడంపైనా ఆలోచన చేస్తున్నది. వీటన్నింటిపై కేబినెట్లో మంత్రులందరితో చర్చించి సీఎం ముందుకు వెళ్లనున్నారు. అదే సమయంలో కాళేశ్వరంపై సీబీఐ కేసు నమోదు చేయకపోవడాన్ని ఏ రకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే దానిపై కార్యాచరణతో పాటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి చర్చించనున్నారు. జనగణన అంశం కూడా కేబినెట్లో చర్చకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన సీపెక్ సర్వే కు సంబంధిచిన ఇండిపెండెంట్ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పైనా చర్చించనున్నారు. వాటికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది.

