సర్కారు స్కీమ్స్​ను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మీనాక్షి నటరాజన్మ

సర్కారు స్కీమ్స్​ను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మీనాక్షి నటరాజన్మ
  • పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలి: మీనాక్షి నటరాజన్మ
  • హబూబ్ నగర్, వరంగల్, నాగర్ కర్నూల్​ పార్లమెంట్​సెగ్మెంట్ల నేతలతో మీటింగ్ 
  • త్వరలోనే అర్హతల ప్రకారం పార్టీ పదవులు: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ లను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు.  గురువారం గాంధీ భవన్ లో నాగర్ కర్నూల్​, వరంగల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్,  ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, వంశీచంద్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు స్కీమ్ ల ప్రభావం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుకూలంగా మార్చుకోవాలని ఆమె సూచించారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కమిటీల ఆలస్యం వల్ల కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవమేనని, త్వరలోనే అర్హతల ప్రకారం పదవులు దక్కుతాయని అన్నారు. 17 నెలల పాలనలో ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని, రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాలు వారిపై  ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 

మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో పీసీసీ అబ్జర్వర్లతో చురుకైన నాయకుల్ని గుర్తించి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందని పీసీసీ చీఫ్ సూచించారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, భూ భారతి పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని ఆయన అన్నారు. అలాగే, ఎంపీ మల్లు రవిపై అలంపూర్​ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తామని మహేశ్​ గౌడ్​  తెలిపారు. 

ఎమ్మెల్యే లకూ నిధులు ఇవ్వాలి

పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని, మంత్రుల నియోజకర్గాలకు ఎన్ని నిధులు పోతున్నాయో కూడా చెక్ చేయాలని ఓ ఎమ్మెల్యే కోరినట్టు తెలిసింది. కులగణన చేసిన నేపథ్యంలో పార్టీ పదవుల్లో బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. అలాగే, ఐఏఎస్, ఐపీఎస్ ల పైనా ఏఐసీసీ ఇన్ చార్జ్, పీసీసీ చీఫ్ లకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదన్నారు. ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా స్పందించడం లేదని మరో ఎమ్మెల్యే మీటింగ్ లో చెప్పినట్టు సమాచారం.