హైదరాబాద్, వెలుగు: స్కూళ్ల తనిఖీలు, అకడమిక్ పర్యవేక్షణ నిమిత్తం టీచర్లు డిప్యూటేషన్పై వెళ్లనున్న నేపథ్యంలో.. ఆయా బడుల్లో విద్యార్థుల రెగ్యులర్ చదువులకు భంగం కలగకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అకడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్సన్ టీమ్ల్లో ఫుల్ టైమ్ మెంబర్లుగా వెళ్లే టీచర్ల స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని స్కూళ్ల పనితీరును పరిశీలించేందుకు అనుభవజ్ఞులైన హెచ్ఎంలు, టీచర్లతో ప్రత్యేక ప్యానెల్ ఇన్స్పెక్సన్ టీమ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్రైమాసిక లక్ష్యాల ఆధారంగా తనిఖీలు చేపట్టేందుకు దాదాపు 2 శాతం మంది టీచర్లను ఫుల్-టైమ్ అకడమిక్ ప్యానెల్ మెంబర్లుగా డిప్యూటేషన్పై కేటాయించారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో ఎస్జీటీలు, ఎల్పీలు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు అవసరానికి మించి మిగులుగా ఉన్నారని విద్యాశాఖ గుర్తించింది. డిప్యూటేషన్పై వెళ్లిన టీచర్ల స్థానంలో ఈ మిగులు సిబ్బందిని సరిచేస్తూ ఆల్టర్నేట్ వర్క్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
