
గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో వారికి మొండిచేయి చూపింది. దళిత బంధు తరహాలోనే గిరిజనుల కోసం త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని గతేడాది సెప్టెంబర్ లో ఆదివాసీ, జంజారాల ఆత్మీయ సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ మాట మరిచిపోయారు. 2023--24 బడ్జెట్లో గిరిజన బంధు కోసం నిధులు కేటాయిస్తారని ఆదివాసీలు, గిరిజనులు ఆశగా ఎదురు చూశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ ఊసెత్తలేదు. గిరిజన బంధు కోసం ఒక్క రూపాయి కూడా ప్రతిపాదించలేదు.
నిరుద్యోగ భృతి...
2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ కార్యరూపం దాల్చడం లేదు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి అందించలేదు. 2022 – 23 బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించినా.. ఆ ఏడాది మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఈ పథకాని ప్రభుత్వం అటకెక్కించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.