పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచిన సర్కార్

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచిన సర్కార్

మే డే కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  పారిశుద్ధ్య కార్మికులకు  వెయ్యి  వేతనం పెంచారు సీఎం కేసీఆర్. దీంతో  రాష్ట్ర  వ్యాప్తంగా ఉన్న లక్షా 6 వేల 474 మందికి జీతాలు పెరగనున్నాయి.  జీహెచ్ఎంసీ,  మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ జీతాలు పెరగనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు.

‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని..ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు కేసీఆర్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని సీఎం తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నందన్నారు  సీఎం. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందన్నారు.