
- పైలట్ ప్రాజెక్టు కింద తొలుత ఐదు గ్రామాల్లో చేయిస్తం: మంత్రి పొంగులేటి
- ఫీడ్బ్యాక్ తరువాత మిగిలిన గ్రామాల్లో చేయిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి.. సర్వే చేయని లేదా సర్వే రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయని.. గత పది సంవత్సరాలలో ఈ సమస్యకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపలేదని విమర్శించారు. ముందు 413 గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించి.. అందులో వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామని తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రెండు పద్ధతులలో విస్తృత సర్వే జరుగుతుందని, ఏరియల్/ డ్రోన్ సర్వే పద్ధతి, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతుల్లో సర్వే చేసి జియో రిఫరెన్డ్స్, క్యాడస్ట్రల్ మ్యాపులు, హక్కుల నమోదు పత్రాలను తయారు చేస్తారని తెలిపారు.
ఈ నూతన విధానాల వలన భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందన్నారు. ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ రీ సర్వే కోసం వివిధ రాష్ట్రాలలో రీ సర్వే లో అనుభవం కలిగిన ఆర్వీ అసోసియేట్స్, మార్వెల్ జియో స్పేషియల్, ఐఐసీ టెక్నాలజీస్, నియో జియో, డ్రోగో డ్రోన్ సంస్థలను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. పైలట్ గ్రామాల్లో ఈ సంస్థలు రీ సర్వే చేస్తాయని, సర్వే ఫలితాల ఆధారంగా మిగిలిన గ్రామాలకు విస్తరిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆధునిక యంత్రాలు, టెక్నాలజీని వాడుకుని శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.