బనకచర్లపై రాజకీయ పోరు .. అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం

బనకచర్లపై రాజకీయ పోరు .. అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం
  • గోదావరి ప్రాజెక్టులు, బనకచర్లపై పవర్​పాయింట్​ ప్రజంటేషన్​
  • ప్రాజెక్టును అడ్డుకునేందుకు కలిసిరావాలని సీఎం రేవంత్​, మంత్రి ఉత్తమ్​ పిలుపు
  • 2016 అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో కేసీఆర్​ మాటలను ప్రస్తావించిన రేవంత్​ రెడ్డి
  • రాజకీయాలు చేస్తున్నారన్న వద్దిరాజు రవిచంద్ర.. మీటింగ్​ నుంచి వాకౌట్​
  • నేడు కేంద్రమంత్రి సీఆర్​ పాటిల్​తో రేవంత్, ఉత్తమ్​ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా కడుతున్న గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్ట్​పై రాష్ట్ర సర్కారు రాజకీయ పోరాటం ప్రారంభించింది. సీఎం రేవంత్​ రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నేతృత్వంలో బనకచర్ల ప్రాజెక్టుపై బుధవారం సెక్రటేరియెట్​లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్​ ఎంపీలతో పాటు బీఆర్ఎస్​ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ నుంచి డీకీ అరుణ, రఘునందన్​ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా పేర్కొన్న కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్  ఈ సమావేశానికి హాజరు కాలేదు. 

అఖిలపక్ష సమావేశంలో భాగంగా గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులు, ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఎంపీలకు అధికారులు పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. ఏపీ ప్రభుత్వంపై రాజకీయ పోరాటంతోపాటు సాంకేతికంగా, న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమైనట్టు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని, రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాగా, మీటింగ్​ సందర్భంగా ఎంపీలు రఘునందన్​ రావు, డీకే అరుణ, రఘువీర్​ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర  పలు అంశాలపై ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్​ అడిగారు.

జీఆర్ఎంబీకి జనవరిలోనే ఫిర్యాదు: ఉత్తమ్​

ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలను తీసుకున్నామని, తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. ఏపీ ప్రాజెక్టు కడుతున్న విషయం తెలియగానే వెంటనే గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్​ఎంబీ)కు జనవరిలోనే ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకూ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ జనవరి 24న ఇరిగేషన్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ.. సెంట్రల్​ వాటర్​ కమిషన్​, జీఆర్​ఎంబీకి లేఖ రాశారని వెల్లడించారు. 

ఆ తర్వాత  ప్రాజెక్టును ఆపాలంటూ  మార్చి 3న సీఎం రేవంత్​, తాను కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చామన్నారు. మే 14న జీఆర్ఎంబీ చైర్మన్​తో మీటింగ్​ సందర్భంగా ఏపీ ఏర్పాటు చేసిన జలహారతి కార్పొరేషన్​, బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్​ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారని చెప్పారు. మే 28, జూన్​ 11, 13, 16న బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి  వరుస లేఖలు రాశామని గుర్తు చేశారు.

వద్దిరాజు వాకౌట్

​పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ సందర్భంగా నాడు ఏపీకి అనుకూలంగా రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై మాజీ సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రస్తావించారు. ఆనాడు కేసీఆర్​ హామీ ఇవ్వడంతోనే ఇప్పుడు ఏపీ ఇలా గోదావరి జలదోపిడీకి పాల్పడుతున్నదని చెప్పుకొచ్చారు.

 దీనిపై బీఆర్ఎస్​ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిలపక్షం అని పిలిచి రాజకీయాలు మాట్లాడుతున్నారని, అది తగదని వారించారు. ఇందులో రాజకీయాలేమీ లేవని సీఎం అన్నారు. దీంతో వద్దిరాజు రవిచంద్ర మీటింగ్​ నుంచి వాకౌట్​ చేసి వెళ్లిపోయారు. 

నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ..

బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖను కోరనుంది. ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్​తో ఢిల్లీలో సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి  భేటీ కానున్నారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టును వెంటనే అడ్డుకోవాలంటూ కేంద్ర మంత్రిని కోరనున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి ప్రాజెక్ట్​

నిబంధనలను ఉల్లంఘించి బనకచర్ల ప్రాజెక్టును ఏపీ చేపడుతున్నదని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించారని, పోలవరం నేషనల్​ ప్రాజెక్ట్​ ఆపరేషనల్​ షెడ్యూ ల్​ను మార్చారని, గోదావరి ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధంగా ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. నదీ పరివాహక రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రాజెక్టుపై ఏపీ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న దని పేర్కొన్నారు. 417 కిలోమీటర్ల పొడవునా ఓపెన్​ కెనాల్స్​, పైప్​లైన్లు, టన్నెల్స్​, 9 లిఫ్టులతో 200 టీఎం సీలను బనకచర్ల వరకు పోలవరం నుంచి లిఫ్ట్​ చేసుకునేలా రూ.81,900 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రతిపా దించారని ఎంపీలకు ఉత్తమ్​ వివరించారు. 

పోలవరం ప్రాజెక్టు ఫుల్​ కెపాసిటీతో నిర్మిస్తే.. ఆ ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​తో మన రాష్ట్రంలోని భద్రాచలం గుడి, మణుగూరు భారజల కేంద్రం, దుమ్ముగూడెం ప్రాజెక్ట్​, తెలంగాణ –ఏపీ బార్డర్​లోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తుతుందని చెప్పారు. పోలవ రం–బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదని, టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​కూ ఆమోదం తెలపలేదని చెప్పారు. ఇక, పోలవరం దగ్గర ఎలాంటి మిగులు జలాలు లేవని 2018లో సెంట్రల్​ వాటర్​ కమిషన్​ తెలిపిందని గుర్తు చేశారు. అయినా కూడా మిగులు జలాల పేరుతో ఏపీ ప్రాజెక్టును చేపడుతున్నదని విమర్శించారు. 

తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. తెలంగాణ న్యాయబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న ఏపీ.. తమ అక్రమ ప్రాజెక్టులను మాత్రం యుద్ధప్రాతిపదికన చేపడుతున్నదని మండిపడ్డారు.