V6 News

రేపు ( డిసెంబర్ 10 ) హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు..

రేపు ( డిసెంబర్ 10 ) హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు..

హైదరాబాద్ లో రేపు (డిసెంబర్ 10)న 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.  ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్  డిపోలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీజీఆర్టీసీ  ఎండీ వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించనున్నారు.  ఉదయం  10 గంటలకు  బస్సుల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే.   నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో   ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతోంది.

గ్రేటర్ హైదరాబాద్​లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ కోసం 2027 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వ్యవస్థను నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల వినియోగంతో వ్యక్తిగత వాహన కొనుగోళ్లు తగ్గి, ప్రజా రవాణా వాడకం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది. 

గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 25 డిపోలు ఉన్నాయి. వీటిలో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తి చార్జింగ్ కోసం హెచ్​టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్​కో ద్వారా నిర్మించింది. 

కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ హెచ్​టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రజా రవాణా విస్తరణకు కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.