- మున్సిపాలిటీల విలీనంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో 26 మున్సిపాలిటీలను ఏ చట్టం కింద విలీనం చేశారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. మున్సిపాలిటీల విలీనంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. మున్సిపాలిటీల విలీనానికి సంబంధించిన మున్సిపల్ చట్టానికి తీసుకువచ్చిన సవరణలను సవాల్ చేస్తూ రంగారెడ్డి జల్లా తక్కుగూడ మండలం రావిర్యాలకు చెందిన ఆర్. లక్ష్మణ్ మరొకరు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు అభ్యంతరాలంటే చట్టాన్ని సవాలు చేయాల్సి ఉందని తెలిపారు.చట్టాన్ని సవాలు చేయకుండా విలీనం గురించి ప్రశ్నించకూడదని చెప్పారు. వాదనలను విన్న బెంచ్ విలీనంపై స్టేకు నిరాకరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
