
- హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక అభివృద్ధి కోసం విలువైన భూములు కేంద్రానికి ఇచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు
- కానీ, వాటిలో అనేక సంస్థలు మూతపడ్డయ్
- సీసీఐ, ఇతర ఫ్యాక్టరీల రీఓపెన్కు చొరవ చూపాలి
- ఆ భూములను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టొద్దు
- కేంద్ర మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ సమావేశం
న్యూఢిల్లీ, వెలుగు:హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 7,183.13 ఎకరాల భూములపై తేల్చాలని కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ భూములను ఆరు కేంద్ర సంస్థలకు కేటాయించగా, వాటిలో అనేక సంస్థలు మూతపడ్డాయని చెప్పారు. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టవద్దని, మూతపడిన ఫ్యాక్టరీలను రీఓపెన్ చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. అలాగే, రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ను కోరారు.
అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో శ్రీధర్ బాబు మాట్లాడారు. కేంద్ర సంస్థలకు కేటాయించిన భూముల సమస్యను పరిష్కరించాలని కేంద్రమంత్రి కుమారస్వామిని కోరినట్టు ఆయన తెలిపారు. ‘‘ఉమ్మడి ఏపీలో1960లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాయితీపై కేటాయించారు. అయితే వాటిలో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఆ సంస్థల పరిధిలోని భూములు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉన్నాయి.
కొన్ని సంస్థలు ఆ భూములను వాణిజ్యపరంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరిలో హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ పరిధిలో 324.87 ఎకరాలు, ఐడీపీఎల్ పరిధిలో 551.03 ఎకరాలు, హెచ్ఎంటీ పరిధిలో 888.05 ఎకరాలు, సంగారెడ్డిలోని హిందుస్తాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్ పరిధిలో 126.33 ఎకరాలు, ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిధిలో 2,272.85 ఎకరాలు, సంగారెడ్డి ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిధిలో 3,020 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రికి వివరించాను. మూతపడిన ఫ్యాక్టరీలను రీఓపెన్ చేసేందుకు చొరవ చూపాలని కోరాను” అని శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
చైనా ఆంక్షలతో ఉత్పత్తి రంగంపై ప్రభావం..
రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. ‘‘ప్రస్తుతం అన్ని ముడి సరకుల కోసం చైనాపై ఆధారాపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఫార్మా రంగంలోనూ చైనా ఆంక్షలు విధిస్తే సమస్య తీవ్రమవుతుంది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి విజ్ఞప్తి చేశాను. అలాగే కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించాను.
చైనా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తెలంగాణలో తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి సహకారం అందించాలని కేంద్రాన్ని కోరాను” అని తెలిపారు. ‘‘హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–నాగ్పూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ల అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరాను.
జహీరాబాద్లో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ.400 కోట్ల నిధులు పీఎం గతిశక్తి స్కీం కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాను. వరంగల్ ఫ్యూచర్ సిటీ, మామునూరు విమానాశ్రయం అభివృద్ధి సహా పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరాను. కేంద్రం ప్రతిపాదించిన వంద పారిశ్రామిక పార్కుల స్కీమ్కు నిధులివ్వాలని, హైదరాబాద్లో జాతీయ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను” అని వివరించారు.
తెలంగాణ మెట్రోపై ఎందుకీ వివక్ష?
తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని కేంద్రాన్ని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ‘‘కేంద్ర కేబినెట్ మీటింగ్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం లభిస్తుందని ఆశించాం. కానీ పుణె మెట్రోకు అనుమతిచ్చి, హైదరాబాద్ మెట్రోను విస్మరించారు. తెలంగాణపై ఎందుకీ వివక్ష? మెట్రో ఫేజ్2 డీపీఆర్ను ఇప్పటికే కేంద్రానికి ఇచ్చాం. ప్రధాని, కేంద్రమంత్రులను సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులం కలిసి పలుమార్లు విన్నవించాం. అయినప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం” అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతి ఇవ్వాలని కోరారు. దీన్ని తెర వెనుక నుంచి ఎవరు అడ్డుకుంటున్నారో తెలియదన్నారు.