- ప్రతి నియోజకవర్గంలో ఒక్కోటి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు: మంత్రి శ్రీధర్ బాబు
- మహిళా సాధికారత ఇంటి నుంచే మొదలవ్వాలి
- ‘వీ -ఎనేబుల్’ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని చెప్పారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యసాధనలో మహిళలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ‘వీ హబ్’ ఆధ్వర్యంలో ఆదివారం డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ ఎనేబుల్’ గ్రాడ్యుయేషన్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. ఇప్పుడిప్పుడే సమాజంలో ప్రగతిశీల మార్పు కనిపిస్తున్నదని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. 2017–18 నుంచి 2023–24 మధ్య కాలంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 22 శాతం నుంచి 40.3 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతం అని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే ఎక్కువగా నమోదు కావడం రాష్ట్ర పురోగతికి అద్దం పడుతున్నదని కొనియాడారు.
మహిళలు కూడా పురుషులకు దీటుగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహించగలరని ‘వీ హబ్’ నిరూపించిందన్నారు. ఈ స్ఫూర్తితో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించే సార్టప్స్ ను అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్ ప్రైజెస్ గా మార్చేలా ‘వీ హబ్ 2.0’కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ వేదిక ద్వారా ఒకేచోట స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెంటార్షిప్ అందుబాటులో ఉండేలా ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తామన్నారు.
మహిళల ఆలోచన తీరులోనూ మార్పు రావాలని, ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించేలా కొత్తగా ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారిణి జ్వాల గుత్తా, ఫిలిం ప్రొడ్యూసర్ ప్రియాంక దత్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోల్ల తదితరులు పాల్గొన్నారు.
