కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మార్చి నెలలో మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించడానికి దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్- 8 నుంచి ఆలయాలు తెరచుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ దర్శనాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అయితే కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం లేదని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించడం తప్పనిసరి అని.. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు ధర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్న ఆయన.. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు.
పుష్కరిణిలో స్నానాలకు అనుమతి లేదని.. అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ, వసతి సౌకర్యాలు ఉండవన్నారు. ఆలయాల వద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు పొందవచ్చని తెలిపారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయన్నారు. కంటైన్ మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. 65 ఏండ్ల పైబడిన వారు, 10 ఏండ్ల లోపు పిల్లలు, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆలయ దర్శనాలకు రావద్దని సూచించారు దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.