న్యూఢిల్లీ: ఫ్యూచర్ రెడీనెస్ లిస్ట్లో టెస్లా, లులూల్మన్, మాస్టర్కార్డ్, గూగుల్ కంపెనీలు బెస్ట్ కంపెనీలుగా నిలిచాయి. కరోనా మహమ్మారి తర్వాత కాలంలో ఎదగడానికి కంపెనీలు ఎంత రెడీగా ఉన్నాయనేది స్టడీ చేసి, ఈ రిపోర్టు విడుదల చేశారు. స్విట్జర్లాండ్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) ఈ రిపోర్టు రిలీజ్ చేసింది. 2010–2021 కాలానికి సంబంధించిన డేటాను స్టడీ చేసి లిస్ట్ తయారు చేశారు. లిస్టెడ్ కంపెనీల డేటాను మాత్రమే పరిశీలనలోకి తీసుకున్నారు. ఆయా రంగాలలోని కంపెనీలకు పోటీదారులెవరు, భవిష్యత్తులో ఆ కంపెనీలు ఎలా తట్టుకుని నిలబడతాయనేది స్టడీ చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో పోటీని ఆయా కంపెనీలు ఎలా ఎదుర్కొంటాయనే అంశాన్నీ పరిశీలించారు. ఎక్కువ రెవెన్యూ వస్తున్న నాలుగు ఇండస్ట్రీలు, 89 కంపెనీలను స్టడీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. ఫ్యాషన్ అండ్ రిటెయిల్, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ రంగాలలోని కంపెనీల డేటాను విశ్లేషించినట్లు పేర్కొంది.
ఫ్యూచర్ రెడీనెస్ లిస్ట్లో ఒక్క ఇండియా కంపెనీ కూడా లేదు. 40 అమెరికా కంపెనీలు చోటు దక్కించుకోగా, చైనా, జర్మనీల నుంచి ఏడేసి కంపెనీలు, ఫ్రాన్స్, జపాన్ల నుంచి ఆరేసి కంపెనీలు, స్విట్జర్లాండ్, యూకేల నుంచి రెండేసి కంపెనీలు, ఆర్జెంటీనా, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, తైవాన్ దేశాలకు చెందిన ఒక్కో కంపెనీ లిస్ట్లో ప్లేస్ దక్కించుకున్నాయి.
యూనికార్న్ల సంఖ్యలో మొట్టమొదటిసారిగా చైనాను ఇండియా 2021లో దాటేసిందని ఫ్యూచర్ రెడీనెస్ ఇండికేటర్ రూపకర్త ప్రొఫెసర్ హోవార్డ్ యూ చెప్పారు. ఫ్లిప్కార్ట్, శ్నాప్డీల్, ఓలా వంటి కంపెనీలు స్టార్టప్ ఎకోసిస్టమ్లో పెద్ద మార్పులే తెచ్చాయని పేర్కొన్నారు. చాలా మల్టీనేషనల్ కంపెనీలను ఇండియాలోకి ఐటీ కంపెనీలు తేగలిగాయని చెప్పారు. ప్రోబ్లమ్ ప్రైవేటు కంపెనీలలో లేదని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే ఇండియా వెనకబడి ఉందని తమ స్టడీలో తేలినట్లు వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోవాలని యూ అభిప్రాయపడ్డారు. ఆటోమోటివ్ సెక్టార్లో టాప్ కంపెనీలలో ఒక్కటి కూడా ఇండియా నుంచి లేదని పేర్కొన్నారు. కానీ దానికి కారణం టాటా, మహీంద్రా వంటి కంపెనీలలో ఇనొవేషన్ లేకపోవడం మాత్రం కాదని చెప్పారు. ఆ కంపెనీలు ఇనొవేట్ చేయగలవు...కాకపోతే రేపటి తరపు స్మార్ట్ వెహికల్స్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఆధారంగా పనిచేసేవేనని, సిటీలలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అవి ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇండియాలో లేవని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరందుకోవాలన్నా, సూపర్ ఛార్జర్ల నెట్వర్క్ చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. చైనాలోని ఆటో కంపెనీలు నియో, బైడ్లు తమ సొంత ఇనొవేషన్ మీదే కాకుండా, ఆ దేశలలోని అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లా ప్రయోజనం పొందుతున్నాయన్నారు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముఖ్యం..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని యూ చెప్పారు. సంస్కరణలు అమలు తర్వాత గత నలభై ఏళ్లలో ఇండియా చాలా ముందంజ వేసిందని, కానీ, గ్లోబల్ స్కేల్ పోటీపడటానికి ఇంకా చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. కరోనాకు ముందు కాలంలో, కొత్త ట్రెండ్లను అందిపుచ్చుకున్న కంపెనీలే తమ పోటీదారులను తట్టుకుని ముందడుగు వేశాయని తమ స్టడీలో తేలిందన్నారు. స్పోర్ట్స్వేర్ బ్రాండ్స్ లులూల్మన్, నైక్లు మొదటి రెండు ప్లేస్లలోనూ నిలిచాయని, ఆ తర్వాత ప్లేస్లలో లగ్జరీ బ్రాండ్స్ హెర్మెస్, బర్బెర్రీ, కెరింగ్, ఎల్వీఎంహెచ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆటోమోటివ్ సెగ్మెంట్లో టెస్లా టాప్ ప్లేస్లో నిలవగా, టొయోటా, బీఎండబ్ల్యూ, హ్యుండయ్లు ఆ తర్వాత నిలిచినట్లు వివరించారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో మాస్టర్ కార్డ్, వీసాలు మొదటి ప్లేస్లలో ఉండగా, యాంట్ గ్రూప్, స్క్వేర్, పేపాల్లు ఆ తర్వాత ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ రంగంలో గూగుల్ , అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యూఎస్ సెమికండక్టర్ కంపెనీ ఏఎండీలు టాప్ ప్లేస్లలో నిలిచినట్లు వెల్లడించారు. లిస్టులో టాప్లోని కంపెనీలన్నీ కొత్త ట్రెండ్లను అందిపుచ్చుకున్నాయని అన్నారు.