బస్ పాస్ రేట్లు పెరిగినయ్... ఆర్డినరీ పాస్లపై 23 శాతం పెంచిన ఆర్టీసీ

బస్ పాస్ రేట్లు పెరిగినయ్... ఆర్డినరీ పాస్లపై 23 శాతం పెంచిన ఆర్టీసీ
  • స్టూడెంట్​ బస్​ పాస్​లపై 50 శాతం
  • ఇక మెట్రో ఎక్స్​ప్రెస్​లలోనూ విద్యార్థులకు అనుమతి
  • సోమవారం నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​పరిధిలో బస్​పాస్​రేట్లు పెరిగాయి. ఆర్డినరీ పాస్​లపై 23 శాతం, స్టూడెంట్​బస్ పాస్​లపై 50 శాతం రేట్లు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో నెలవారీ బస్​పాస్​లతో ప్రయాణించే వారిపై ఆర్థికభారం పడనుంది. స్టూడెంట్ బస్​పాస్ రేట్లను గత మూడేండ్లుగా పెంచలేదని, సంస్థపై పెరిగిన ఖర్చుల భారం నుంచి కొంత ఊరట పొందడానికే చార్జీలను పెంచినట్టు అధికారులు తెలిపారు. 

ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి స్టూడెంట్స్​మెట్రో ఎక్స్​ప్రెస్​లలో కూడా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. అలాగే టోల్​ప్లాజా యూజర్​చార్జీలను కూడా సవరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టోల్​ప్లాజా మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుంచి అదనంగా ప్లాజాకు రూ.10 వసూలు చేస్తామన్నారు. టోల్​ప్లాజా మీదుగా ప్రయాణించక పోతే యూజర్​చార్జీలు ఉండవని పేర్కొన్నారు.