- వ్యాక్సిన్ వచ్చిన వెంటనేఇస్తామని వెల్లడి
- వివిధ రంగాల్లో 19 లక్షలఉద్యోగాలకు హామీ
- పప్పు ధాన్యాలకూకనీస మద్దతు ధర
- ఫ్రీ వ్యాక్సిన్ హామీపై ప్రతిపక్షాల మండిపాటు
పాట్నా/ న్యూఢిల్లీ: బీహార్లో అధికారంలోకి వస్తే అందరికీ కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ‘ఆత్మనిర్భర్ బీహార్’ లక్ష్యంగా ‘ఐదు సూత్రాలు.. ఒక లక్ష్యం.. 11 సంకల్పాలు’ పేరిట తయారు చేసిన పార్టీ మేనిఫెస్టోను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాట్నాలో విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో బీహార్ అభివృద్ధికి తీసుకోవాలనుకుంటున్న చర్యల గురించి అందులో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ను పెద్ద సంఖ్యలో తయారు చేసి.. అవి అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ టీకాను ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన మొదటి హామీ అదేనన్నారు.
అనుమానాలున్నయా? తీరుస్తం..
బీహార్ ప్రజలంతా రాజకీయంగా సున్నితమైన వాళ్లని, ప్రతి విషయమూ వాళ్లకు తెలుసని నిర్మల అన్నారు. పార్టీలు ఇస్తున్న ఎన్నికల హామీలను వాళ్లు అర్థం చేసుకోగలరని అన్నారు. ఎవరికైనా తమ పార్టీ మేనిఫెస్టోపై అనుమానాలు ఉంటే ప్రశ్నించొచ్చని, ప్రతి ఒక్కరికీ కచ్చితమైన సమాధానాలు చెప్తామని, సందేహాలు తీరుస్తామని ఆమె చెప్పారు. ఎన్డీయే హయాంలో బీహార్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. తమ 15 ఏళ్ల పాలనలో జీడీపీ 3 నుంచి 11.3 % పెరిగిందని చెప్పారు. 15 ఏళ్ల జంగిల్ రాజ్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడడం వల్లే బీహార్ అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి జరగాలంటే నితీశ్కుమార్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆమె కోరారు. ‘‘ఎన్డీయేకి ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నా. మమ్మల్ని గెలిపిస్తే వచ్చే ఐదేళ్లు నితీశ్కుమారే బీహార్కు సీఎంగా ఉంటారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది’’ అని అన్నారు. బీహార్ జనం పని తెలిసిన వాళ్లని, అందుకే ప్రతి రాష్ట్రంలోనూ వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
వ్యాక్సిన్ కోసం షెడ్యూల్ చూస్కోవాలా : రాహుల్
బీజేపీ ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కావాలంటే అన్ని రాష్ట్రాల జనాలు ఎన్నికల షెడ్యూల్ చూసుకోవాల్సిందేనంటూ ట్వీట్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే వ్యూహాలను ప్రకటించింది. జనాలంతా తమతమ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడున్నాయో షెడ్యూల్ చూసుకోవాలి. తమ వరకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలి. వాటితో పాటే బీజేపీ తప్పుడు ప్రచారాలనూ తెలుసుకోండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటూ ప్రజల ఆరోగ్యాన్నీ బీజేపీ రాజకీయం చేసేసిందని చత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ విమర్శించారు. బీజేపీ హామీ ప్రకారం.. ఎన్నికలు లేని రాష్ట్రాల్లో ప్రజలు వ్యాక్సిన్ కొనుక్కోవాలా అని ప్రశ్నించారు. బీహార్ వాళ్లకే వ్యాక్సిన్ను ఫ్రీగా ఇస్తారా అని విమర్శించారు.
మేమూ ఫ్రీగా ఇచ్చేస్తం.. తమిళనాడు సీఎం ప్రకటన
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ను అందజేస్తామని తమిళనాడు సీఎ పళనిస్వామి ప్రకటించారు. వ్యాక్సిన్కు ఆమోదం వచ్చి రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చిన వెంటనే జనానికి టీకా ఇస్తామన్నారు. ఆ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
కరోనాతో పాలిటిక్సా?: ఆర్జేడీ
బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర కామెంట్స్ చేశారు. కరోనాను పాలిటిక్స్కు వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉన్న భయాన్ని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
మేనిఫెస్టో హైలైట్స్..
- అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్
- వ్యవసాయంలో 10 లక్షల ఉద్యోగాలు
- వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఐటీ జాబ్స్
- 3 లక్షల టీచర్ పోస్టు ల భర్తీ
- ఆరోగ్య రంగంలో లక్ష మంది నియామకం
- వేరే రాష్ట్రంలో పనికి వెళ్లిన కూలీలు చనిపోతేవారి ఫ్యామిలీకి రూ.2 లక్షల పరిహారం
- దేశం కోసం సరిహద్దు ల్లో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం,రూ.25 లక్షల పరిహారం
- పల్లెలు, పట్టణాల్లోని 30 లక్షల మందికి ఇళ్లు పల్లెలు, పట్టణాల్లోని 30 లక్షల మందికి ఇళ్లు