
- రాష్ట్రానికి న్యాయం చేయాలి
- ఏకగ్రీవంగా ఆమోదించిన సభ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవే శపెట్టింది. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.‘‘రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం విస్మరించింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వివక్షకు గురైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంట్లో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి, వివిధ విజ్ఞప్తులు చేశారు.
రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతోపాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేకసార్లు అభ్యర్థనలు అందించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై పూర్తిగా వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ పట్ల కేంద్ర అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలి” అని తీర్మానంలో పేర్కొన్నారు.