
న్యూఢిల్లీ: యూఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ కంపెనీల్లో మరో బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్ల) ను ఇన్వెస్ట్ చేసింది. బ్లాక్డీల్స్లో అదానీ ఎంటర్ప్రెజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను కొనుగోలు చేసింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు 70 శాతం మేర పడిన విషయం తెలిసిందే. ఆ టైమ్లో జీక్యూజీ గ్రూప్ అదానీ గ్రూప్లో రూ.15,446 కోట్లు (1.87 బిలియన్ డాలర్ల)ను ఇన్వెస్ట్ చేసి రూ. 10 వేల కోట్ల వరకు లాభం పొందింది. దీంతో తన ఇన్వెస్ట్మెంట్లను కంపెనీలో పెంచుకుంటోంది. ఈ ఏడాది మే నెలలో 400–500 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. తాజాగా జీక్యూజీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 1.6 శాతం వాటా లేదా 1.8 కోట్ల షేర్లను, అదానీ గ్రీన్ ఎనర్జీలో 2.22 శాతం వాటా లేదా 3.52 కోట్ల షేర్లను బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రూ. 2,300 దగ్గర, అదానీ గ్రీన్ షేర్లు రూ.920–927 వద్ద బ్లాక్ డీల్స్లో చేతులు మారాయని వెల్లడించారు. బ్లాక్డీల్స్ జరగడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు బుధవారం సెషన్లో 5 శాతం పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఇంట్రాడేలో 6 శాతం పడినా, చివరికి ఫ్లాట్గా ముగిశాయి. హిండెన్బర్గ్ నష్టాల నుంచి రికవరీ అవ్వడంలో అదానీ గ్రూప్కు జీక్యూజీ పార్టనర్స్ ఇన్వెస్ట్మెంట్లు సాయపడ్డాయని చెప్పాలి. మరోవైపు రూ.21 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మడానికి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల బోర్డులు ఈ ఏడాది మే నెలలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.