
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాలలో ఉన్న 14 వందల మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 4వ తేదీ నుండి తాము ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా విశ్వవిద్యాలయం నుండి రోడ్డుపైకి ర్యాలీగా వెళ్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లనీయకుండా గేట్లకు తాళాలు వేయడంతో వారు పోలీసులతో వాగ్విదానికి దిగారు. అక్కడే బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారని ఉపాధ్యాయులు గుర్తు చేశారు. తాము గత 30 సంవత్సరాలుగా టీచింగ్ చేస్తూ..ఎంతో మంది నిరుపేదలకు విద్యను అందిస్తున్నామని అయినా... తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే విశ్వవిద్యాలయలలో విద్యను స్తంభింపజేసి.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.