
హైదరాబాద్, వెలుగు:కరోనా కంట్రోల్పై సీఎం కేసీఆర్ 20 రోజుల తర్వాత రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటళ్ల లో ట్రీట్మెంట్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో అందుతున్న ట్రీట్మెంట్పై కూడా ఫోకస్ పెట్టాలని సూచించారు. గత నెల 28న కరోనాపై రివ్యూ చేసి ఫామ్హౌస్కు వెళ్లిన సీఎం.. అటు తర్వాత ఈ నెల 11న ప్రగతిభవన్కు తిరిగివచ్చారు. ప్రగతిభవన్కు వచ్చిన తర్వాత వివిధ అంశాలపై రివ్యూ చేపట్టిన కేసీఆర్.. ఎట్టకేలకు శుక్రవారం కరోనాపై సమీక్షించారు.
మరణాలు తక్కువ.. రికవరీ ఎక్కువ
కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, పరిస్థితి అంత భయంకరంగా లేదని, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజలు హైరానా పడి అధిక ఖర్చు చేస్తూ ప్రైవేటు హాస్పిటళ్లకు పోవొద్దని, సర్కార్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలి. సర్కార్ హాస్పిటళ్లలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మంచి ట్రీట్మెంట్ అందుతోంది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని హాస్పిటల్కు వెళ్లి, డాక్లర్ల సలహా తీసుకోవాలి. తెలంగాణలో పీహెచ్సీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్మెంట్ కోసం ఏర్పాట్లున్నాయి’’ అని సీఎం వివరించారు. జాతీయ సగటుతో చూసుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని, రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. లక్షణాలు లేకున్నా కొవిడ్- 19 ప్రొటోకాల్ ప్రకారం.. వైరస్ సోకిన వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ట్రీట్మెంట్ అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవద్దు
రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన మెడిసిన్స్, ఇతర పరికరాల కొరత లేదని సీఎం అన్నారు. ‘‘హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశాం. అన్ని హాస్పిటల్స్లో కలిసి మొత్తం 10 వేల బెడ్లను కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించాం. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
10% కరోనా ఇన్సింటివ్ కొనసాగింపు
‘‘కరోనా నేపథ్యంలో అత్యవసర పనులు కోసం జనరల్ బడ్జెట్కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించాం. మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్స్కు యూజీసీ స్కేల్ అమలు చేయాలని నిర్ణయించాం. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లిస్తాం. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న లెక్చరర్ల రిటైర్మెంట్ ఏజ్ను 65 ఏండ్లకు పెంచాలని నిర్ణయించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే 10% కొవిడ్ ఇన్సెంటివ్ కొనసాగిస్తాం. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికీ ఇన్సెంటివ్ లను కొనసాగించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది డాక్టర్లను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలి. పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి’’ అని సీఎం ఆదేశించారు.
ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మిడ్ డే మీల్స్
ఈ ఏడాది నుంచి అన్ని సర్కార్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్కు మిడ్ డే మీల్స్ పెట్టాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన స్టూడెంట్లు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీంతో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మిడ్ డే మీల్స్ పెట్టాలని నిర్ణయించామన్నారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై శుక్రవారం సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. జడ్చర్ల కాలేజీని స్ఫూర్తిగా తీసుకొని అన్ని సర్కార్ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ.50 లక్షల నిధులు, అదే విధంగా లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు ఆ కాలేజీకి కొత్త భవనాన్ని సీఎం మంజూరు చేశారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్ లెక్క చెప్పాలి
ప్రైవేటు హాస్పిటళ్లల్లో బెడ్ల అందుబాటు విషయం లో పారదర్శకంగా వ్యవహరించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. ‘‘ప్రతి హాస్పిటల్ తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? అనే విషయాలను బహిరంగ పరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలి’’ అని ఆదేశించారు.