అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులకు పాల్పడ్డాడు: ఢిల్లీ పోలీసులు

అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులకు పాల్పడ్డాడు: ఢిల్లీ పోలీసులు

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు తెలిపారు. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్‌ భూషణ్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. ఢిల్లీ పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు.

ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్‌ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్‌ భూషణ్‌ తన గదికి పిలిచి గట్టిగా కౌగలించుకున్నారని, ఆమె ప్రతిఘటించడంతో.. ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేసినట్లు తన చర్యను బ్రిజ్‌ భూషణ్‌ సమర్థించుకున్నట్లు నివేదికలో చెప్పారు. అదే సమయంలో అనుమతి లేకుండా తన చొక్కాను పైకెత్తి అసభ్యంగా ప్రవర్తించారని మరో మహిళా రెజ్లర్‌ ఫిర్యాదులో తెలిపారు. ఈ రెండు ఘటనలు బ్రిజ్‌ భూషణ్‌ తాను చేస్తున్న చర్యలపట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. 

కొద్ది నెలల క్రితం బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మైనర్‌ బాధితురాలు తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌పై మిగిలిన మహిళ రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు కోర్టుకు తెలిపారు.