
సూపర్ లగ్జరీ కార్ల సేల్స్‘సూపర్’
50 శాతం పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ : మనదేశంలో సూపర్ లగ్జరీ కార్లు ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించేవి. సంపన్నులు కూడా వీటిని పరిమితంగానే కొనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వీటికి డిమాండ్ చాలా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మార్కెట్లు మాంద్యంలో ఉన్నప్పటికీ, భారతదేశంలో లగ్జరీ కార్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మనదేశంలోని డాలర్ మిలియనీర్లు, బిలియనీర్లు ఇటువంటి లగ్జరీ వెహికల్స్ను తెగ కొంటున్నారు. అందుకే కొన్ని సంవత్సరాలుగా, లగ్జరీ కార్ల కంపెనీలు భారతదేశ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. 2022లో వీటి అమ్మకాలు ఏకంగా 50 శాతం పెరిగాయి. 2018 నాటి రికార్డును బద్దలు కొట్టాయి. భారతదేశంలో ఇటువంటి అల్ట్రా- లగ్జరీ కార్ల (కనీస ధర రూ. రెండు కోట్లు– అంతకంటే ఎక్కువ) అమ్మకాలు ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత గ్రోత్ను సాధించడం విశేషం. అల్ట్రా-లగ్జరీ కార్ల మార్కెట్లో ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్మేకర్ లంబోర్ఘిని హవా నడుస్తోంది. ఫెరారీ, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ, పోర్షే మేబ్యాక్ వంటివి కూడా క్రమంగా అమ్మకాలను పెంచుకుంటున్నాయి. కరోనా మహమ్మారి రిస్ట్రిక్షన్లను తొలగించిన తరువాత ఈ లగ్జరీ బండ్లకు గిరాకీ ఎంతగానో పెరిగింది. రూ.నాలుగు కోట్ల వరకు ధర ఉండే కార్లను అమ్ముతున్న లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ కొనుగోలుదారులు అల్ట్రా-లగ్జరీ కార్లను ఎంతోగానో ఇష్టపడుతున్నారని చెప్పారు. కోవిడ్ తర్వాత "వారి ఆశలను, ఆకాంక్షలను" నెరవేర్చుకున్నారని వివరించారు. ఇదివరకటిలా లగ్జరీ కార్లు కొనడానికి వెనుకాడటం లేదని శరద్ చెప్పారు. "సూపర్-లగ్జరీ కార్ల మార్కెట్ ఈ సంవత్సరం 450 యూనిట్ల మార్క్ను సాధిస్తుందన్నది మా అంచనా. 2021లో మొత్తం 300 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2018లో అమ్ముడయిన 325 యూనిట్ల మార్క్ను ఈసారి అధిగమిస్తాం" అని అగర్వాల్ తెలిపారు.
ఫారిన్ కార్లంటే క్రేజ్
ధనవంతులు, యువ భారతీయులు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతున్న కార్లను చాలా ఇష్టపడుతున్నారని లగ్జరీ కార్ల సెల్లర్లు అంటున్నారు. ఇవే కార్లను ఇక్కడ నడపాలనుకుంటున్నారని, అందుకే అక్కడి మార్కెట్లలోనూ అల్ట్రా-లగ్జరీ కార్లను ఇండియాకు తీసుకొస్తున్నామని వివరించారు. లగ్జరీ కార్లకు డిమాండ్ చాలా బాగుందని, మహమ్మారి తర్వాత గిరాకీ ఇంకా పెరిగిందని సెలెక్ట్ కార్స్ సీఈఓ యదుర్ కపూర్ పేర్కొన్నారు. కపూర్ కంపెనీ రోల్స్ రాయిస్, ఫెరారీ, లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ బ్రాండ్ల కార్లను అమ్ముతోంది. కోవిడ్ చాలా మందికి చేదు అనుభవాలను మిగిల్చిందని, ధనవంతులుగా మరణించే బదులు ధనవంతులుగా బతకాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో బెంట్లీ బ్రాండ్ కార్లను విక్రయిస్తున్న ఎక్స్క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బాగ్లా మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం వ్యక్తుల ఆలోచనలు మారాయన్నారు. డబ్బును ఆదా చేయడం కంటే వస్తువులను సొంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు.
డుకాటి ఇండియా సోమవారం డిజర్ట్ఎక్స్ లగ్జరీ మోటార్సైకిల్ను రూ. 17,91,000 (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఎడారి దిబ్బలు, ఇరుకైన మార్గాలు, కంకర రోడ్లు, పర్వత మలుపుల్లోనూ దీనిని సులువుగా నడపవచ్చు. ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్కతా చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్షిప్లలో బైక్ కోసం బుకింగ్లు ఓపెన్ అయ్యాయి. డెలివరీలు జనవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. డుకాటి డిజర్ట్ ఎక్స్లోని 937 సిసి ట్విన్ -సిలిండర్ ఇంజన్ 9,250 ఆర్పీఎం వద్ద 110 హెచ్పీని, 6,500 ఆర్పీఎం వద్ద 92 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది.