
విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, త్రిష లాంటి స్టార్ కాస్ట్తో మణిరత్నం తీసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న అన్ని భాషల్లో రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ ‘మణిరత్నం నా డ్రీమ్ డైరెక్టర్. అందుకే ఇందులో గుర్రంపై వచ్చే సీన్ ఒక్కటి చేస్తే చాలనుకున్నా. అలాంటిది మంచి రోల్ దక్కింది. ఇంతమంది స్టార్స్ కలిసి నటించడం రికార్డ్’ అన్నాడు. తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు మాట్లాడుతూ ‘ఒక్క హీరోతో సినిమా తీయాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంతమందిని పెట్టి నూట యాభై రోజుల్లో రెండు పార్టులుగా తీయడం చాలా గొప్ప విషయం. సినిమాకి భాషలతో సంబంధం లేదు. ఇప్పుడంతా ఇండియన్ సినిమానే. పొన్నియిన్ సెల్వన్ ఇండియా అంతటా అద్భుతం సృష్టిస్తుంది’ అన్నారు. జయం రవి మాట్లాడుతూ ‘ఇక్కడ పుట్టకపోయినా నేను పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు’ అన్నాడు. కార్తి మాట్లాడుతూ ‘ఇండియాలో తెలుసుకోవాల్సిన కథలెన్నో ఉన్నాయి. వాటిలో ఇదొకటి.
సీనియర్ ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని నేను డైలాగ్స్ చెప్పాను’ అన్నాడు. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ ‘మా పెళ్లి కంటే ముందే మణి ఈ కథ నాకు చెప్పారు. ముప్ఫై నాలుగేళ్ల తర్వాత సినిమాగా వస్తోంది. దీనికి కారణమైన సుభాస్కరన్ గారికి థ్యాంక్స్. ఒరిజినల్ స్టోరీ తమిళనాడుదే అయినా ఆంధ్ర, తెలంగాణల్లోనే షూటింగ్ జరిగింది. అందుకే ఇది తెలుగు సినిమా’ అన్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కలవడం ఆనందంగా ఉందంది త్రిష. ‘ఈ సినిమా చూశాక నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీల్లో విదేశీ కంటెంట్ చూడటం మానేశా. ఎందుకంటే వాటన్నింటిలో లేని మన కల్చర్, మనకు తెలిసిన ముఖాలు ఇందులో ఉన్నాయి’ అన్నారు రెహమాన్. తాను ఈవెంట్కు రాకపోయినా తన మనసు ఇక్కడే ఉందంటూ వీడియో మెసేజ్ ద్వారా చెప్పారు మణిరత్నం. ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.