ప్రేమ పెళ్లి : యువకుడిని దారుణంగా కొట్టి, అమ్మాయిని లాక్కెళ్లారు

ప్రేమ పెళ్లి : యువకుడిని దారుణంగా కొట్టి, అమ్మాయిని లాక్కెళ్లారు

సూర్యాపేట జిల్లా : ప్రేమ వివాహం చేసుకున్న యువడిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. ఈ సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలంలోని, మర్రికుంట గ్రామంలో జరిగింది. మర్రికుంట గ్రామానికి చెందిన వినయ్, పెన్ పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మేజర్లయిన వీరిద్దరు బుధవారం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు మర్రికుంటలోని వినయ్ ఇంటికి వెళ్లి రాళ్లు, కర్రలతో వినయ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అమ్మాయిని కొడుతూ బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. వినయ్ కి తీవ్రంగా రక్తస్రావం కావడంతో బంధువులు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.