ఊర్లలోనూ ఎల్ఆర్ఎస్?..ప్రపోజల్స్ రెడీ

ఊర్లలోనూ ఎల్ఆర్ఎస్?..ప్రపోజల్స్ రెడీ

హైదరాబాద్, వెలుగు:మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మాదిరిగానే ఊళ్లలోనూ ఇండ్ల జాగలను రెగ్యులరైజ్ చేసేందుకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీల ఇన్ కమ్ పెంచడంతో పాటు ఇండ్ల నిర్మాణం పద్ధతి ప్రకారం జరిగేలా చూడడమే  లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తోంది. కొత్త పంచాయతీ రాజ్​ చట్టంలోని రూల్స్​కు తగ్గట్టుగా ఈ విధానం ఉండేలా గ్రామీణాభివృద్ధి శాఖ ఫోకస్​పెట్టింది.కేబినెట్​సబ్​కమిటీ కూడా కొన్ని ప్రపోజల్స్ ను రెడీ చేసింది. వాటిని త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది.

కేబినెట్ సబ్ కమిటీ రెకమండేషన్స్ ఇవీ…

  • పర్మిషన్ ఉన్న లేఅవుట్లలో నిర్మాణాలకు అనుమతులివ్వాలి. మౌలిక వసతుల పనులు పూర్తి కాకుంటే డెవలపర్​కు కొంత సమయం ఇవ్వాలి.
  • పర్మిషన్ ఉన్న స్థలాన్ని రెండేండ్ల లోపు లే అవుట్​చేయాలి. లేకపోతే పర్మిషన్​ల్యాప్స్​అవుతుంది. ఇప్పుడీ పర్మిషన్​గడువును పొడిగించాలి.
  • లేఅవుట్ లో డెవలపర్ సౌలతులు కల్పించకపోతే… అందుకయ్యే ఖర్చుకు మూడు రెట్ల మొత్తాన్ని సదరు డెవలపర్ గ్రామ పంచాయతీకి జరిమానాగా చెల్లించాలి.
  • లేఅవుట్ ప్లాన్​కు భిన్నంగా రోడ్డు వెడల్పు/కామన్ సైట్ తక్కువగా ఉంటే, పక్క ప్లాట్ల నుంచి భూమిని సేకరించాలి. ఒకవేళ భూములు అందుబాటులో లేకుంటే.. ఆ భూమి విలువకు మూడు రెట్ల మొత్తాన్ని డెవలపర్​జీపీకి చెల్లించాలి.
  • పర్మిషన్ లేని లేఅవుట్లలో అన్ని పనులు పూర్తయితే, అక్కడ అన్ని సదుపాయాలను డెవలపర్​కల్పించాలి. లేకుంటే అందుకయ్యే ఖర్చుకు మూడు రెట్ల మొత్తాన్ని డెవలపర్ జీపీకి చెల్లించాలి.
  • పర్మిషన్ లేని లేఅవుట్లలో ఓపెన్ స్పేస్​ను మిగిలిన అవసరాలకు కేటాయించేలా జీపీ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ భూమి అందుబాటులో లేకపోతే, దాని విలువకు 10 రెట్ల మొత్తాన్ని డెవలపర్ జరిమానాగా చెల్లించాలి.
  • పర్మిషన్ లేని లే అవుట్ లేదా ఇంకా పనులు ప్రారంభం కాని లే అవుట్లను రెగ్యులరైజ్ చేయరు. ఇలాంటి వాటికి కొత్త లేఅవుట్ ప్రపోజల్స్ ఇవ్వాలి.
  • 300 చదరపు గజాల ప్లాట్లకు సంబంధించి పర్మిషన్ ఉన్న లేఅవుట్ లో రోడ్డు వెడల్పు/కామన్​స్పేస్ తక్కువగా ఉంటే… మౌలిక వసతుల నిర్మాణానికి రూ. 5.58 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో సెమీ అర్బన్​ ఏరియాల్లోని లేఅవుట్లలో ఒక్కో ప్లాట్​కు రూ.5.58 లక్షలతో పాటు 10శాతం స్పేస్​ కాస్ట్ అంటే రూ. 2.50 లక్షలు కలిపి మొత్తం రూ. 8.08 లక్షలు జీపీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇక మండల కేంద్రాల్లో అయితే రూ. 6.83 లక్షలు, మేజర్​ గ్రామ పంచాయతీల్లో అయితే రూ. 6.33 లక్షలు, తండాల్లో అయితే రూ. 5.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

జీపీలకు సరిపోని ఫండ్స్

గ్రామాల్లో సౌలతులు కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ సరిపోవడం లేదు. కొత్తగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, ఉన్న వాటికి రిపేర్లు చేసేందుకు పంచాయతీల వద్ద ఫండ్స్ ఉండడం లేదు. దీంతో జీపీలే ఆదాయం సమకూర్చుకునేలా పంచాయతీరాజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. ఆఫీసర్లు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించి లేఅవుట్లను పరిశీలించారు. ఊళ్లలో ఒక పద్ధతి ప్రకారం ఇండ్ల నిర్మాణం జరగకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. సిటీలు, నేషనల్ హైవేలు, మెయిన్ రోడ్లకు సమీపంలో ఉండే ఊళ్లలో పర్మిషన్ లేకుండానే లేఅవుట్లు చేస్తూ, సౌలతులు కల్పించకుండానే ఇండ్ల జాగాలను విక్రయిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో జీపీ ఫండ్స్ నుంచే వసతులు కల్పించాల్సి వస్తోంది. దీంతో లేఅవుట్లు చేసే వారినే ఇందుకు బాధ్యులను చేయాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తోంది.

కరోనా ఇంకా పోలే జాగ్రత్త!