భార్య చనిపోయిందని ఉరేసుకున్నడు

భార్య చనిపోయిందని ఉరేసుకున్నడు

కోనరావుపేట, వెలుగు: అనారోగ్యంతో భార్య చనిపోవడంతో తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ గ్రామానికి చెందిన నోముల భూమిరెడ్డి(80), లక్ష్మి(76) దంపతులకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. కొడుకులు ఎక్కడి వారక్కడే సెటిలయ్యారు. వృద్ధ దంపతులు ఇద్దరూ గ్రామంలోనే ఉంటున్నారు. అనారోగ్యంతో కొన్నేళ్లుగా లక్ష్మి మంచానికే పరిమితమైంది. భూమిరెడ్డి అన్నీ తానై భార్యకు సేవలు చేస్తున్నాడు. లక్ష్మి అనారోగ్యంతో శనివారం రాత్రి చనిపోయింది. భూమిరెడ్డి సైతం ఇంట్లో శవం పక్కనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా హాస్పిటల్​కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ చెప్పారు.