
- ఫోన్ ట్యాపింగ్కేసులో ఇక రివ్యూ కమిటీ వంతు!
- ప్యానెల్ సభ్యుల నుంచి సమాచారం సేకరిస్తున్న సిట్
- ప్రస్తుత డీజీపీ జితేందర్ నుంచి కూడా స్టేట్మెంట్
- విచారణకు హాజరైన పీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, ప్రణీత్ రావు
- నేడు ప్రభాకర్, ప్రణీత్ రావు కన్ ప్రంటేషన్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న హోంశాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్కుమార్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికం సర్వీసెస్కు పంపిన ఫోన్ నంబర్లకు సంబంధించిన అనుమతులపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు వీరిద్దరు ఇప్పటికే లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఈ విషయం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు జరుగుతున్న క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులే స్వయంగా వెళ్లి వీరిద్దరి వద్ద వివరాలు సేకరించినట్టు సమాచారం. ప్రధానంగా ప్రభాకర్ రావు టీమ్ సేకరించిన ఫోన్ నంబర్లను మావోయిస్టు సానుభూతిపరుల ఫోన్ నంబర్లుగా పేర్కొంటూ ట్యాపింగ్కు అనుమతులివ్వడంపై వారి స్టేట్మెంట్లు తీసుకున్నట్లు తెలిసింది.
ట్యాప్ చేసే అధికారం ఐజీ స్థాయి ఆఫీసర్కే..
ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఐజీ స్థాయి లేదా ఆపై ఆఫీసర్కు మాత్రమే అధికారం ఉంటుంది. పదవీ విరమణ పొంది ఓఎస్డీ హోదాలో ఉన్న ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో ‘ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీ’గా నియమించడంపై సిట్ వివరణ తీసుకున్నది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలోనూ కేవలం 7 రోజుల వరకు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత కూడా ఫోన్లపై నిఘా పెట్టాలంటే మళ్లీ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.
కానీ.. అందుకు విరుద్ధంగా ప్రభాకర్ రావు టీమ్ ఇష్టమొచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది. ఈ మేరకు జితేందర్, అనిల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నది. 2023లో రివ్యూ కమిటీ ఎన్ని సార్లు జరిగింది..? ఎస్ఐబీ డేటా డిలీట్ చేసేందుకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు..? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో పాటు జితేందర్, అనిల్ కుమార్ ఇచ్చిన వివరణను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
కీలకంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు
ప్రభాకర్ రావు, ప్రణీత్రావు ఇచ్చే స్టేట్మెంట్లు సిట్ దర్యాప్తులో కీలకంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రవిగుప్త నుంచి కూడా సమాచారం సేకరించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నది. 2022లో జరిగిన మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్లోనూ పెద్ద సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పట్లో ఈసీకి ఫిర్యాదులు అందాయి.
ప్రణీత్రావు టీమ్ అందించిన సమాచారంతో భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రత్యర్థి పార్టీల కదలికలపై నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ అడ్డుకుని కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లు ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. ప్రభాకర్ రావు సహా ఈ కేసులో మిగిలిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లతో అప్పటి రివ్యూ కమిటీని కూడా సిట్ విచారించనున్నట్లు సమాచారం.
నా ఫోన్ ట్యాప్ చేసిన్రు: పీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తను కొడంగల్ ఇన్చార్జ్గా పని చేసినట్లు పీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి అన్నారు. అప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. సాక్షిగా సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. ట్యాపింగ్ లిస్ట్లో ఉన్న ఫోన్ నంబర్లు చూపి సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నలు అడిగారు.
ప్రణీత్రావు కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ప్రణీత్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. 3 రోజుల విచారణలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలతో పాటు ఇప్పటికే సేకరించిన డాక్యుమెంట్లు, సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించారు. గురువారం ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఎదురెదురుగా కూర్చోబెట్టి (కన్ ప్రంటేషన్) విచారించనున్నట్టు తెలిసింది.