
ఆస్కార్ రేసులో భారత సినిమాలు పోటీ పడనున్నాయి. ది ఛల్లో షో అనే సినిమా నామినేట్ అయిన విషయం ఇప్పటికే అధికారికంగా తెలిసిందే. కాగా ప్రస్తుతం మరిన్ని చిత్రాల జాబితాను ఆస్కార్స్ ప్రకటించింది. వాటిలో ది ఛల్లో షో పాటు ఆర్ఆర్ఆర్, కశ్మీరీ ఫైల్స్, గంగూబాయి కత్వాడీ, కాంతార, విక్రాంత్ రోణ కూడా ఉన్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా 95వ ఆస్కార్ అవార్డ్స్కు నామినేట్ అయిన చిత్రాల జాబితాను 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది.
గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన కాంతార.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. కాగా ఈ సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. ‘‘కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. ఆస్కార్ ఫైనల్లోనూ కాంతార సత్తా చాటాలని కోరుకుంటున్నాం’’ అని ఈ సినిమాను ఆదరించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది. మరో కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’ కూడా ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ఆ చిత్ర బృందం కూడా ట్వీట్ చేసింది.