అందరినీ బురిడి కొట్టించి..ప్రియుడిని పెళ్లి చేసుకుంది

అందరినీ బురిడి కొట్టించి..ప్రియుడిని పెళ్లి చేసుకుంది

విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన మహిళ కేసులో మిస్టరీ వీడింది. బీచ్లో కన్పించకుండా పోయి నెల్లూరులో ప్రత్యక్షమైన మహిళ తాజాగా బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే తన తల్లిండ్రులకు మెసేజ్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని.. తనకోసం వెతకొద్దని సూచించింది. రవితో ఇష్టపూర్వకంగానే వెళ్లానని..పెళ్లి కూడా చేసుకున్నట్లు తాళిబొట్టుతో ఉన్న ఫొటోలు పంపినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. 

అసలేం జరిగిందంటే..

విశాఖలోని ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన భార్యభర్తలు శ్రీనివాస్, సాయిప్రియలు ఆర్కేబీచ్ కు వెళ్లారు. రాత్రి 7.30 సమయంలో భర్త ఫోన్ మాట్లాడుతుండగా భార్య అదృశ్యమైంది. కాళ్లు కడుకోవడానికి వెళ్లిన తన భార్య కన్పించడం లేదని..సముద్రంలో గల్లంతయ్యిందేమోనని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రెస్క్యూ నిర్వహించారు. హెలీకాఫ్టర్ తో కూడా గాలింపు  చేపట్టారు. రెండు రోజులపాటు సముద్ర తీరాన్ని జల్లెడ పట్టిన ఎక్కడా ఆచూకీ దొరకలేదు.  
 
నెల్లూరులో ఉన్నట్లు గుర్తింపు 

అయితే కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటున్న సాయిప్రియ గల్లంతవడం వెనుక మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు. అయితే పోలీసులు వెళ్లే లోపే ఆమె బెంగళూరు వెళ్లినట్లు సమాచారం. ఆమెకు రవి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉందని.. అతడి కోసమే భర్తను వదిలేసి వెళ్లిపోయినట్లు వెల్లడైంది.