- 7 రోజుల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద శనివారం తాము చేపట్టిన నిరసన కేవలం 'ట్రైలర్' మాత్రమేనని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 7 రోజుల్లోగా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. లేదంటే క్షేత్రస్థాయిలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తమ పిలుపునకు స్పందించి శనివారం జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన 'ఎక్స్' వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రదర్శనను ఒక ‘చరిత్రాత్మక’ శక్తి ప్రదర్శనగా అభివర్ణించారు. విద్యా వ్యవస్థపై యువతలో ఉన్న తీవ్ర ఆగ్రహానికి ఇది అద్దం పడుతోందన్నారు.
‘మనమంతా ఏకమైతే ఏం చేయగలమో ప్రభుత్వానికి చూపించాం. గొంతు విప్పనంత కాలం మార్పు రాదు’ అని స్పష్టం చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా తొలిసారి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, మద్దతుదారులకు దీప్కే ధన్యవాదాలు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా హాజరై మద్దతు ప్రకటించారు.
