ముంబై: వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం టికెట్ డబ్బులు ఇవ్వకపోవడం దారుణం అన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కు చెందిన మంత్రి నితిన్ రౌత్. ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి స్వరాష్ట్రాలకు వెళ్లిన 27,865 మందికి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) రైలు చార్జీలు చెల్లించిందన్నారు. అవసరమైన ప్రతి వలస కూలీకి, కార్మికుడికి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కావాల్సిన రైలు చార్జీలను కాంగ్రెస్ పార్టీయే భరిస్తుందని సోనియాగాంధీ మే 4న ప్రకటించారన్నారు.
ఆమె పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లో బాధితులను గుర్తించి కాంగ్రెస్ నేతలు రైలు చార్జీలు భరిస్తున్నారని తెలిపారు. తనతో పాటు మరో కాంగ్రెస్ నేత సునీల్ కేదార్ రెండు ప్రత్యేక రైళ్లకు చార్జీలను పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు. మరో విజయ్ వాడెట్టివార్ పలువురు వలస కూలీలు విడివిడిగా సాయం అందించారని తెలిపారు నితిన్ రౌత్.
వలస కూలీల నుంచి ఎలాంటి ప్రయాణ చార్జీలు వసూలు చేయకుండా స్వస్థలాలకు చేర్చాలని, అవసరమైన వారికి కేంద్ర ప్రభుత్వం చార్జీలు చెల్లించకపోతే ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కమిటీలు ఆ ఖర్చును భరించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.