న్యూఢిల్లీ: ఎయిర్పోర్టులకు చెందిన ప్రాపర్టీలలో హోటళ్ల నిర్మాణం వేగవంతమైంది. విమాన ప్రయాణాలు పెరగడం, చిన్న పట్టణాలకూ కనెక్టివిటీ ఉండడంతో ఎయిర్పోర్టుల సమీపంలో హోటళ్ల ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. వ్యాపార ప్రయాణికులు, ట్రాన్సిట్ ప్యాసింజర్లు, విమాన సిబ్బంది, మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్లు)ఈవెంట్ల కారణంగా వీటికి ఆదరణ పెరుగుతోంది.
భారతదేశంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుండడంతో ఎయిర్పోర్ట్ హోటళ్లు హై-గ్రోత్ సెగ్మెంట్గా మారుతున్నాయని రాడిసన్ గ్రూప్ ఎండీ నిఖిల్ శర్మ తెలిపారు. కమర్షియల్ హబ్లకు దగ్గరగా ఉండే హోటళ్లపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఎయిర్పోర్టుల విస్తరణ వల్ల గతంలో సీజనల్గా మాత్రమే ఉండే పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చాలెట్ హోటల్స్ సీఓఓ గౌరవ్ సింగ్ వివరించారు. దీనివల్ల హోటల్ ఆక్యుపెన్సీ స్థిరంగా ఉంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. విమాన కనెక్టివిటీ పెరగడం వల్ల కేవలం విహారయాత్రలకే కాకుండా, కార్పొరేట్, కాన్ఫరెన్స్ విభాగాల్లో కూడా హోటళ్లకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
