- ఐదేండ్లలో 7.83 కోట్ల ట్రాఫిక్ కేసులు.. 2,832 కోట్ల ఫైన్లు
- నిరుడు ఒక్క ఏడాదే రూ.612 కోట్ల ఇన్ కం
- ఇందులో స్పెషల్ డ్రైవ్లో వసూలు చేసినవే సగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారుకు ట్రాఫిక్ చలానాలతో ఏటా భారీగా ఆమ్దానీ సమకూరుతోంది. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు తీసే ఫొటోలకుతోడు సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ చలానాలు ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే టెక్నాలజీ రావడంతో చలానాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానిస్టేబుళ్లకు టార్గెట్లు విధిస్తుండడంతో వారు ట్రాఫి క్ను కంట్రోల్ చేయడం పక్కనపెట్టి ఫొటోలు తీయడంపైనే దృష్టిపెడుతున్నారు. 2018 నుంచి 2022 దాకా ఏకంగా 7.83 కోట్ల ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.2,812 కోట్ల ఫైన్లు వేశా రు. నిరుడు 1,65,84,234 ఎంవీ యాక్ట్ కేసులు రిజిస్టర్ కాగా, రూ.612 కోట్లు వసూలు చేశారు. ఇందులో 2022 మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 దాకా 46 రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో వసూలు చేసినవే రూ.300 కోట్లకు పైగా ఉన్నాయి. సుమారు 2.92 కోట్ల చలాన్లు క్లియరయ్యాయి. ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ కు సంబంధించి వితౌట్ హెల్మెట్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాస్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సీట్ బెల్ట్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ సహా మొత్తం18 రకాల సెక్షన్లతో చలానాలు విధిస్తున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులు డబుల్
రాష్ట్రవ్యాప్తంగా నిరుడు అన్ని పోలీస్ కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు డబుల్ అయ్యాయి. తాగి వెహికల్స్ నడిపేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే గత ఏడాది 36 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ ఏడాది 57 వేల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుడు 21,077 కేసులు పెడితే.. ఈ సారి 42,637 కేసులు నమోదుచేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుడు 6,226 కేసులు, ఈ ఏడాది 14,512 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నిరుడు 11,980 మంది పట్టుబడగా, ఈ ఏడాది 14,845 మంది తాగి వెహికల్స్ నడుపుతూ చిక్కారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో రాత్రి 10 తర్వాత స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించే వాళ్లు. ఇప్పుడు 8 గంటలకే స్టార్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(బీఏసీ) లెవల్స్ 30 ఎమ్జీ కంటే ఎక్కువ వచ్చిన వారిపై చార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించి, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడే వారికి కోర్టులు రూ.10 వేల దాకా జరిమానా విధిస్తున్నాయి. దీంతో పాటు జైలు శిక్ష వేసి, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్టరైన కేసుల్లో గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో విధించే ఫైన్ లే రూ.వందల కోట్లలో ఉంటున్నాయి.
హెల్మెట్ ఫైన్ లే ఎక్కువ
ట్రాఫిక్ చలానాలు పడుతున్న వారిలో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ కేసులు ఉంటున్నాయి. ఇలాంటి చలానాల డేటాను టీఎస్ పోలీస్ వెబ్సైట్స్, టీఎస్ కాప్ ట్యాబ్స్ లో ఫీడ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ (వెహికల్ చెకింగ్) టైమ్లో చలాన్లు పెండింగ్ ఉన్న వెహికల్స్ను సీజ్ చేస్తున్నారు. కనీసం సగం చలానాల అమౌంట్ చెల్లిస్తే తప్ప వెహికల్స్ను వదిలిపెట్టడం లేదు.
‘కమాండ్ కంట్రోల్’తో పెరిగిన నిఘా
రోడ్లపై తిరిగే ప్రతి వెహికల్ పై నిరంతర నిఘా ఉంటోంది. సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసుల చేతుల్లోని డిజిటల్ కెమెరాలు, సెల్ ఫోన్లు నీడలా వెంటాడుతున్నాయి. బం జారా హిల్స్ లో పోలీస్ టవర్స్ (కమాండ్ కంట్రోల్ సెంటర్) నిర్మాణం తర్వాత ఈ నిఘా పెరిగింది. ఉన్నతాధికారులు టార్గెట్లు విధిస్తుండడంతో ఒక్కో కానిస్టేబుల్ కనీసం 250 నుంచి 300 దాకా వైలేషన్ వెహికల్స్ను ఫొటోలు తీస్తున్నారు. దీనికి తోడు సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ లేజర్ గన్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఇలా కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ కింద పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. కాంటాక్ట్ కేసుల్లో సర్వీస్ చార్జీలు లేకుండా యాక్ట్ ప్రకారం మాత్రమే ఫైన్ లు విధిస్తున్నారు. కానీ సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ కెమె రాలతో ఈ–చలాన్స్ జనరేట్ చేసే నాన్ కాంటాక్ట్ కేసుల్లో మాత్రం ప్రతి చలాన్పై రూ. 35 అదనంగా వేస్తున్నారు. ఇలా ఏటా సర్వీస్ చార్జీలే రూ.కోట్లలో వసూలవుతున్నాయి.