శంషాబాద్/ ఉప్పల్/గండిపేట, వెలుగు: ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ తెచ్చుకుంటానని ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లిన విద్యార్థిని మిస్సింగ్ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. పాలమాకుల గ్రామానికి చెందిన మౌనిక(18) ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం బుధవారం గ్రామంలోని ఇంటర్నెట్ సెంటర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటర్నెట్ సెంటర్ చుట్టుపక్కల వెతికారు. అయినా మౌనిక ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లి మాధవి పీఎస్లో కంప్లయింట్ చేసింది. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు చోట్ల మరో ఇద్దరు
రామాంతాపూర్లోని రాజేంద్రనగర్లో ఉండే పీవల్ సబిత(26) ఉప్పల్లోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తోంది. ఈ నెల 27న ప్రెస్ కు వెళ్లిన సబిత రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లి ప్రేమ్ బాయి ఉప్పల్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. తన కూతురిని ఉదయ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె తన కంప్లయింట్లో పేర్కొంది. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. నార్సింగి పరిధి మంచిరేవుల ప్రాంతానికి చెందిన కొత్త శ్రీరాములు(43) క్యాటరింగ్ పనిచేస్తున్నాడు. ఈ నెల 25న ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు గురువారం నార్సింగి పోలీసులకు కంప్లయింట్ చేశారు.