హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒడిశాలోని పూరీలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఆధ్యర్యంలో బుధవారం మొదలైన బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సదస్సులో హైడ్రా కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హైడ్రా పనితీరును పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాలతో పాటు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
రంగనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్లో చెరువులే ప్రధాన వనరులని గుర్తించి వాటి పునరుద్ధరణ చేపట్టామన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించి 2182 ఎకరాలను కాపాడినట్లు వివరించారు. వీటి అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు 9.48 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 80 వేల కోట్లకు పైగా) ఉంటుందన్నారు.
న్యూఢిల్లీలో 500కు పైగా చెరువులు కబ్జాలకు గురై పార్కింగ్ యార్డులుగా మారిపోయాయని, వాటిని పునరుద్ధరించడం సాధ్యం కాలేదని ఢిల్లీ ప్రతినిధులు అన్నారు. హైదరాబాద్లో ఆక్రమణలు తొలగించి చెరువులను కాపాడటం సాధారణ విషయం కాదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
