
- ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
- పార్లమెంట్ హౌస్ వసుధ కాంప్లెక్స్లో పోలింగ్ కేంద్రం
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఓటింగ్
- ఆ తర్వాత ఓట్ల లెక్కింపు.. వెంటనే ఫలితాల ప్రకటన
- ఓటింగ్కు దూరంగా ఉంటున్న బీఆర్ఎస్, బీజేడీ
- మొత్తం సభ్యుల సంఖ్య 781.. మ్యాజిక్ ఫిగర్ 391
న్యూఢిల్లీ: భారత 17వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మంగళవారం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పార్లమెంట్ హౌస్ వసుధ కాంప్లెక్స్లోని రూమ్ నంబర్ ఎఫ్ 101లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు.
రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సహాయకులుగా మరో ఇద్దరు అసిస్టెంట్ రిట్నరింగ్ ఆఫీసర్లు ఉంటారు. కాగా, అధికార ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ ఎంపీలు తమ పార్టీ అభ్యర్థికే ప్రాధాన్యం ఇస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమూ ఉంటుంది. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు పాల్గొనడంలేదు.
మ్యాజిక్ ఫిగర్ 391
దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ అధికారం కలిగిన వ్యక్తి ఉప రాష్ట్రపతి. ఆయన రాజ్యసభకు ఎక్స్- అఫిషియో చైర్పర్సన్గా కూడా ఉంటారు. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో లోక్ సభ, రాజ్య సభ సభ్యులు ఓటు వేస్తారు. పలు ఖాళీల తర్వాత.. ప్రస్తుతం లోక్ సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది సభ్యులు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు.
అయితే, రాష్ట్రపతి అభ్యర్థి గెలుపొందాలంటే... మ్యాజిక్ ఫిగర్ కనీసం 391 ఓట్లు అవసరం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 425 మంది సభ్యుల మద్దతు ఉంది. అలాగే, బయటి నుంచి వైసీపీ మద్దతు ఇస్తున్నది. రాజ్యసభ, లోక్ సభలో వారికి 11 మంది సభ్యులు ఉన్నారు. అలాగే, మరిన్ని చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇండియా కూటమి సంఖ్యా బలం 325 గా ఉంది.
ఓటింగ్ ఎలా ఉంటుందంటే?
ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ర్యాంక్ చేస్తారు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే.. అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి, అతని బ్యాలెట్ పత్రాలను ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు. అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రపోర్షనల్ రెప్రజెంటేషన్ సిస్టమ్తో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ వోట్ (ఎస్టీవీ) పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది.