భార్య పుట్టింటికి వెళ్లి పోయిందని భర్త సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లి పోయిందని భర్త సూసైడ్

ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ టౌన్​కు చెందిన  రుద్రాక్ష(28) అనే యువకుడు కొంత కాలంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్​లోని ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బండార జిల్లా చికాలీ కంకాసుర్​ గ్రామానికి చెందిన జయశ్రీ(24)తో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బర్తీపూర్​లో కాపురం ఉంటున్నారు. కాగా.. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో తరచూ గొడవపడుతున్నారు. మంగళవారం సాయంత్రం జయశ్రీ ‘నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. నీకు ఆస్తులు లేవు. నేను పుట్టింటికి వెళ్తున్నాను. మళ్లీ తిరిగి రాను. నీ చావు నువ్వు చావు’ అని భర్తతో చెప్పి వెళ్లిపోయింది. దాంతో మనస్తాపానికి గురైన రుద్రాక్ష గోధూర్​లోని తన అక్క ఇంటికి వెళ్లి ఫోన్​బుక్​లో భార్య జయశ్రీ, అత్త చంద్రబాగ, మామ వినోద్ తన చావుకు కారణమంటూ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని అక్క అగ్నిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జయశ్రీకి ఇది రెండో వివాహమని.. మొదటి భర్తతో విడాకులు తీసుకుని రుద్రాక్ష ను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.