జైపూర్ : ప్రియుడితో కలిసి ఓ మహిళ సొంత కూతురుని దారుణంగా చంపేసింది. ఈ సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జైపూర్ రూరల్ పరిధిలోని ఉదవల గ్రామానికి చెందిన ఓ మహిళకు ఫోన్ ద్వారా వ్యవసాయ కూలీ ప్రహ్లాద్ సహాయ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన మహిళకు నాలుగేళ్ల కూతురు ఉంది. అయితే బాలిక అనారోగ్యం చెందడంతో ట్రీట్ మెంట్ కు డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేని మహిళ..ప్రియుడితో కలిసి సొంత కూతురిని గొంతు నులిపి చంపేసింది.
ఈ సంఘటన గతేడాది డిసెంబర్ 8న జరుగగా.. తన బిడ్డ ఆడుకుంటుండగా.. మెట్లపై నుంచి పడి తీవ్రంగా గాయపడిందని పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసింది మహిళ. ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా మహిళను ఆరా తీయగా నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన కూతురి ఆరోగ్యం బాగాలేదని.. జైపూర్ నగరానికి తీసుకువెళ్లాలని స్థానిక డాక్టర్ వారికి సూచించగా..చికిత్స కోసం డబ్బు ఖర్చుచేసేందుకు ఇష్టపడని వారు బాలికను గొంతు నులిమి చంపి సమీప అటవీ ప్రాంతంలో పడేశారని విచారణలో తేలిందన్నారు పోలీసులు. చిన్నారి హత్య కేసులో మహిళతో పాటు ఆమె ప్రియుడు ఉన్నాడని వీరిద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. చిన్నారిని చంపిన మహిళకు భర్త బతికే ఉన్నాడని పోలీసులు తెలిపారు.