జోరుగా బెట్టింగ్.. ఏరియాకో మీడియేటర్​ ఎక్కడికక్కడే సెటిల్ మెంట్

జోరుగా బెట్టింగ్.. ఏరియాకో మీడియేటర్​ ఎక్కడికక్కడే సెటిల్ మెంట్
  • సిటీలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
  • ఈజీ మనీ వేటలో యూత్
  • వేలు, లక్షల్లో పందెం

వరంగల్​, వెలుగు: ఐపీఎల్​ మ్యాచ్​లకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. మ్యాచ్​ స్టార్ట్​ అవుతోందంటే ఎక్కడికక్కడ యూత్​ అలెర్ట్​ అయిపోతున్నారు. సాయంత్రమైందంటే చాలు టీవీలు, స్మార్ట్​ ఫోన్లు ముందు పెట్టుకొని బెట్టింగులు షురూ చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన చాలామంది ఈ బెట్టింగుల్లో పైసలు పెడుతుండగా.. ఈ తతంగం అంతా నడిపించడానికి ఓరుగల్లు నగరంలో ఏరియాకో మీడియేటర్​ పనిచేస్తున్నారు. చైన్​ సిస్టంగా పనిచేస్తున్న మీటియేటర్ల బారిన పడి సిటీలో చాలామంది లాస్​ అవుతున్నారు. ఇప్పటికే ఇలా బెట్టింగులకు పాల్పడుతున్న పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. కేఫ్​లు, హోటళ్లు కేంద్రంగాబెట్టింగ్​ నడుస్తుండగా.. రోజుకు లక్షల్లో చేతులు మారుస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పలువురిని అరెస్ట్​ చేశారు. ఆన్​లైన్​లో ఈజీగా మనీ వస్తుండడంతో చాలామంది బెట్టింగులకు అలవాటుపడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్​లో బెట్టింగ్​కు పాల్పడుతున్న పది మందిని అరెస్టు చేసి రూ.లక్షా 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు హన్మకొండ హౌజింగ్​ బోర్డు కాలనీలో టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.37 వేలు స్వాధీనం చేసుకుని సుబేదారి పోలీసులకు అప్పగించారు.

గ్రామాల్లోనూ లక్షల బెట్టింగ్​..

బెట్టింగ్ కల్చర్​ పట్టణాలతో పాటు పల్లెల్లోకి పాకింది. గ్రేటర్​ వరంగల్​ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో నిలదొక్కుకున్న చాలామంది యూత్​ క్రికెట్​పై భారీ పందెం కాస్తున్నారు. ముఖ్యంగా హసన్​పర్తి మండలం చింతగట్టు, దేవన్నపేట, ఆరెపల్లి, వంగపహాడ్​ తదితర గ్రామాల్లో లక్షల్లో బెట్టింగ్​ సాగుతున్నట్లు సమాచారం. గుడెప్పాడ్​ నుంచి సిటీకి వచ్చే మార్గంలో ఉన్న ఓ హోటల్​లో రోజూ సాయంత్రం బెట్టింగ్​ ముఠా తిష్ట వేసి అంతా నడిపిస్తున్నట్లు తెలిసింది. ఇదంతా గుట్టుగా సాగుతుండటంతో ఏరోజుకారోజు వేల నుంచి లక్షల సొమ్ము చేతులు మారుతోంది.

మీడియేటర్ల హవా..

సిటీలో కొన్నిచోట్ల ఏరియాకో మీడియేటర్​ తయారయ్యారు. వారంతా సాయంత్రం కాగానే కేఫ్​లు, హోటళ్లలో అడ్డా వేసి తమకు తెలిసిన వాళ్లతో బెట్టింగ్​ వ్యవహారం నడిపిస్తున్నారు. ముఖ్యంగా సిటీలో పెట్రోల్​ పంపు, కిషన్​పుర, కేయూ క్రాస్​, అలంకార్​ సెంటర్​, పోచమ్మమైదాన్​, వరంగల్​ చౌరస్తా ఏరియాల్లో మీడియేటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరి బారిన పడి చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్​లో లాభాలు చూసే వారి కంటే డబ్బులు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువ అని ఆఫీసర్లు చెబుతున్నారు.