వర్గల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట పరిసరాల్లో లాక్డౌన్ సందర్భంగా అధికారులు సీల్ చేసిన వైన్స్కు కన్నం వేసి అందులో ఉన్న మొత్తం మద్యం బాటిళ్లని చోరీ చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నాచారంగుట్ట పరిసరాలలో ఉన్న వైన్స్కు లాక్డౌన్ సందర్భంగా అధికారులు సీల్ వేశారు. బుధవారం స్థానికుల సమాచారం మేరకు యజమానులు వైన్స్ వద్దకు వెళ్లి చూడగా దానికి కన్నం వేసి ఉంది. తాళం తీసి లోపలకు వెళ్లి పరిశీలించగా లోపల ఉన్న మద్యం సీసాలన్నీ చోరీ చేసినట్టు గుర్తించారు.
వైన్స్ రూమ్ కు వెనకాల నుంచి కొంచెం గోడ బద్దలు కొట్టిన దొంగలు మొత్తం లూటీ చేశారు. వెంటనే ఎక్సై జ్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించగా.. గజ్వేల్ సీఐ ప్రభావతి, గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం హైదరాబాద్ నుంచి క్లూస్ టీమ్ అక్కడకు వచ్చి ఆధారాలు సేకరించారు.