న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో హైవే నిర్మాణ పనులకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చినా రా మెటీరియల్స్ రాక ఇబ్బందులు పడుతున్నామని హైవే డెవలపర్లు చెబుతున్నారు. సిమెంటు, స్టీలు, తారు వంటివి కొందామంటే దొరకడం లేదు. సప్లయ్ చెయిన్లు దెబ్బతినడం, కార్మికులు దొరక్కపోవడంతో వీటిని డెవెలపర్ల దగ్గరికి చేర్చలేకపోతున్నామని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. ఈ మూడింటిని ప్రభుత్వం అత్యవసరాల కేటగిరీలో చేర్చితే తమకు ఇబ్బందులు తొలగిపోతాయని ప్రైవేటు డెవలపర్లు చెబుతున్నారు. ఇప్పుడు రా మెటీరియల్స్ ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కొందామనే ఉద్దేశంతో వీళ్లు భారీగా వర్కింగ్ క్యాపిటల్ను సమీకరించుకున్నారు. అయితే ట్రక్కులకు ఆఫీసర్లు పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల ఇవి డెవలపర్ల దగ్గరికి రావడం లేదు. సాధారణంగా డెవలపర్లు మూడు వారాలకు సరిపడా స్టీల్ను నిల్వ చేస్తారు. మూడు నెలలకు సరిపడా సిమెంట్ కొంటారు. ‘‘స్టీలు, బిటుమిన్ వంటి రా మెటీరియల్స్ సప్లైచెయిన్ పూర్తిగా దెబ్బతింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ట్రక్కులు రావడం సాధ్యం కావడం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలి’’ అని దిలీప్ బిల్డ్కాన్కు చెందిన రోహన్ సూర్యవంశి అన్నారు.
లాక్డౌన్ ఎత్తేసినా….
మొదటి లాక్డౌన్ తరువాత హైవే సెక్టార్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిని వచ్చే నెల మూడోతేదీ వరకు కొనసాగించినప్పటికీ, హైవే కన్స్ట్రక్షన్కు అనుమతులు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇలాంటి ప్రాజెక్టులు ఆలస్యమైన కొద్దీ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి పర్మిషన్లు ఇచ్చారు. దీంతో ఈ నెల 20 నుంచి హైవే పనులు మొదలుపెట్టినా, రా మెటీరియల్స్ లేక పనులను ఆపాల్సి వస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 400 ప్రాజెక్టులను మొదలుపెట్టాల్సి ఉండగా, 250 ప్రాజెక్టులను మాత్రమే మొదలుపెట్టగలిగింది. మరో సమస్య ఏమిటంటే హైవే ప్రాజెక్టుల్లో ఎక్కువగా వలస కూలీలు పనిచేస్తారు. కరోనా వల్ల వీళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోవడంతో డెవలపర్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. లాక్డౌన్ ఎత్తివేసి, బస్సులను రైళ్లను నడపడం మొదలుపెట్టాకే వీళ్లు తిరిగి పనుల్లో చేరుతారని డెవలపర్లు అంటున్నారు. దీనిపై ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ కొందరు వర్కర్లు పనిచేయాలని అనుకుంటున్నా, వాళ్ల కుటుంబ సభ్యులు ఇంటికి రావాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. చాలా మంది డెవెలపర్ల దగ్గర సిమెంటు, స్టీల్, బిటుమెన్ స్టాక్ లేదని వివరించారు.
- హైవే నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇటీవల 250 ప్రాజెక్టుల పనులను తిరిగి మొదలుపెట్టాయి.
- స్టీలు, సిమెంటు, తారు వంటివి అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల పనులను ఆపగా, మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయని హైవే డెవలపర్లు చెబుతున్నారు.
- వీరి దగ్గర ఉన్న సిమెంట్ ఇన్వెంటరీ మూడు వారాలకు, స్టీలు నిల్వలు మూడు నెలల వరకు మాత్రమే సరిపోతాయి. వర్కర్లు, డ్రైవర్ల కొరత వల్ల వీటిని సరఫరా చేయలేకపోతున్నామని స్టీలు, సిమెంటు కంపెనీలు చెబుతున్నాయి.
- కరోనా వల్ల చాలా మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో డెవలపర్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. లాక్డౌన్ ఎత్తివేసి, బస్సులను రైళ్లను నడపడం మొదలుపెట్టాకే వీళ్లు తిరిగి పనుల్లో చేరుతారని డెవలపర్లు అంటున్నారు.