- ఉత్తర ద్వార దర్శనం లేదు.. తెప్పోత్సవానికి రావొద్దు
- వైకుంఠ ఏకాదశి నాడు భద్రాద్రిలో భక్తులకు పర్మిషన్లేదు
- కలెక్టర్ అనుదీప్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్లో నిర్వహించే ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం, తెప్పోత్సవానికి భక్తులకు పర్మిషన్ లేదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ నేపథ్యంలో భద్రాచలం దేవస్థానంలో ఈ నెల 12న నిర్వహించనున్న తెప్పోత్సవంతో పాటు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించడం లేదని అన్నారు. శాస్త్రోక్తంగా కొద్ది మంది అర్చకులు, వేదపండితుల, స్టాఫ్ సమక్షంలో అంతరంగికంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకున్న వారికి తిరిగి క్యాష్ చెల్లిస్తామన్నారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాచలం రావద్దని సూచించారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 10వ తేదీ వరకు గవర్నమెంట్ఆంక్షలు విధించిందన్నారు. అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించినట్టు చెప్పారు.