
- పుస్తకాలు, బ్యాగులు యూనిఫామ్అన్నీ అక్కడే కొనాలి
- బయట మార్కెట్తో పోలిస్తే డబుల్ రెట్లు
- పలుచోట్ల పేరెంట్స్ ఆందోళన, విద్యార్థి సంఘాల దాడులు
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ కార్పొరేట్, ప్రైవేటు బడుల్లో పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్అమ్మకం వ్యాపారం జరుగుతున్నది. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఈ పుస్తకాలు, బ్యాగుల వ్యాపారం గురించి తెలిసినా, ఎవ్వరిపై చర్యలు తీసుకోవడం లేదు. అక్కడక్కడా స్టూడెంట్ యూనియన్లు ఆందోళలు చేసిన చోట.. తాత్కాలికంగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు.
జీవో నం.1 పట్టించుకోని స్కూళ్లు
రాష్ట్రంలో 11 వేల ప్రైవేటు స్కూళ్లుండగా, వాటిలో సుమారు 34 లక్షల మంది చదువుతున్నారు. ఇప్పటికే ఆయా బడుల్లో చదివించే పేరెంట్స్ కు ఇప్పటికే భారీ ఫీజులు భారం ఉండగా, పుస్తకాలు, యూనిఫామ్ అంటూ అదనపు భారాన్ని స్కూల్ మేనేజ్మెంట్లు మోపుతున్నాయి. విద్యాహక్కు చట్టం, జీవో నంబర్1 ప్రకారం స్కూళ్లలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయొద్దనే నిబంధనలు ఉన్నా.. ప్రైవేటు మేనేజ్మెంట్లు అవేవీ పట్టించుకోవడం లేదు.
కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు తమ విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, బ్యాగులు, యూనిఫామ్లను పాఠశాల ఆవరణలోనే లేదా మేనేజ్మెంట్ సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నాయి. బయట ఎవరైనా కొనుగోలు చేసినా, అవి పనికి రావాంటూ పక్కన పెట్టేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులకు ఇతర ప్రత్యామ్నాయాలు లేకుండా పోతున్నాయి. బయటి మార్కెట్లో సగం ధరకే లభించే వస్తువులను.. స్కూళ్లు రెట్టింపు ధరకు అమ్ముతున్నాయి.
ఇది పేరెంట్స్ కు తీవ్ర ఆర్థిక భారంగా మారుతోంది. కేవలం హైదరాబాద్, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కాదు.. మండల కేంద్రాల్లోని ప్రైవేటు స్కూళ్లు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే భారీగా ఫీజులు వసూలు చేస్తు విద్యావ్యాపారాన్ని కొనసాగిస్తున్న మేనేజ్మెంట్లు.. స్కూల్ ఆవరణలోనే పుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫామ్, బ్యాగులు, టైలు, షూస్ తదితర స్టేషనరీ వస్తువులను అమ్ముతూ సైడ్ బిజినెస్నూ కొనసాగిస్తున్నాయి.
క్వాలిటీతో సంబంధం లేకుండానే, పేరెంట్స్ కు అంటగడుతున్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ముందుగానే పేరెంట్స్ డబ్బులు చెల్లించి, ఆన్ లైన్లో అప్లై చేస్తే, రెండువారాల తర్వాత పుస్తకాలు వారికి అందుతున్నాయి. ఓ పేరున్న కార్పొరేట్ స్కూల్లో వేలాది ఫీజులు ముందుగానే కట్టిన పేరెంట్స్ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళనలు..
నిబంధనలకు విరుద్దంగా బడుల్లోనే సైడ్ బిజినెస్ కొనసాగిస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏబీవీపీ తదితర విద్యార్థి సంఘాలు పలు చోట్ల ఆందోళనలు చేశాయి. ఆయా స్కూళ్లపై దాడులూ చేశాయి. పుస్తకాల అమ్మకాన్ని దొరకబట్టి.. ఉన్నతాధికారులకు నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, అప్పటి వరకూ స్టేషనరీ, బుక్స్, యూనిఫామ్ ఉన్న రూమ్ లను సీజ్ చేసి పోతున్నారు. ఆ తర్వాత మేనేజ్మెంట్లు ఒకటీ రెండు రోజుల్లోనే మళ్లీ వాటిని ఓపెన్ చేసి.. వారి సైడ్ బిజినెస్ను కంటిన్యూ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా.. అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
సర్కారు బడుల్లో అన్నీ ఫ్రీ..
ప్రైవేటు బడుల్లో చదువుతో పాటు స్టూడెంట్లకు అవసరమైన వాటిని వ్యాపార ధోరణిలో కొనసాగిస్తుండగా, సర్కారు బడుల్లో మాత్రం ప్రభుత్వం అన్నీ ఉచితంగా అందిస్తోంది. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్లు, వర్క్ బుక్లు, రెండు జతల యూనిఫామ్స్ను ఉచితంగా ఇస్తున్నది. క్వాలిటీ మిడ్డే మీల్స్ కూడా అందిస్తోంది. చదువులో వెనుకబడిన పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారికి మెలకువలనూ నేర్పిస్తున్నారు. పేరెంట్స్ ఇప్పటికైనా ప్రైవేటు చదువులను ప్రెస్టేజీగా తీసుకోకుండా, సర్కరు బడుల్లో చేర్పించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
వ్యాపారం చేసే స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
బడుల్లో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా తమ వద్దనే పుస్తకాలు, యూనిఫామ్ కొనాలంటూ మేనేజ్మెంట్లు పేరెంట్స్ పై ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బడుల్లో వారు చెప్పిన చోటనే పేరెంట్స్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి వస్తున్నది. అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీములతో తనిఖీలు చేసి, కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి.
– టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి