మెహిదీపట్నం, వెలుగు: బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి గురువారం మూడో పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం సమర్పించారు.
అభివృద్ధి పనులు చేపట్టాలి
నల్లపోచమ్మ మహంకాళి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నందకిశోర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ను కలిశారు. బోనాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని వారు మంత్రికి వివరించారు. బోనాల నేపథ్యంలో అభివృద్ధి పనులను చేపట్టాలంటూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.