ముంచుకొస్తున్న మిడతల ముప్పు!

ముంచుకొస్తున్న మిడతల ముప్పు!

మిడతల దండయాత్ర ఇటు రైతులు, అటు ఆఫీసర్లలో దడ పుట్టిస్తోంది. నైరుతి రుతుపవనాల టైం కావడంతో గాలివాటం ద్వారా ఒకటి రెండు రోజుల్లో మిడతల దండు సంగారెడ్డి జిల్లాలోకి కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ల మీదుగా ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 25 నుంచి జూలై 5వ లోగా జిల్లాలోని రాష్ట్ర బార్డర్ల ద్వారా దాదాపు 33 గ్రామాల్లోకి మిడతలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు జిల్లా యంత్రాంగం ఇటీవల గుర్తించింది. వాటిని సమర్థవంతంగా  ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వాటిని అంతమొందించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఈ విషయంపై 22న కలెక్టర్ హనుమంతరావు పోలీసు, అగ్నిమాపక, వ్యవసాయ, ఉద్యాన వన, అటవీ, పంచాయతీ శాఖల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిడతలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. ప్రస్తుతం మిడతలను  ఎదుర్కొనేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలను తయారు చేసే పనిలో ఆయా శాఖల ఆఫీసర్లు  నిమగ్నమయ్యారు.

గాలివాటంతో..

గాలివాటం ఆధారంగా ప్రవేశించే మిడతల దండు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ లోకి ఎంటర్ అయినట్టు తెలిసింది. అంతర్ రాష్ట్రాల మీదుగా జిల్లా బార్డర్‌‌లోని నారాయణఖేడ్ ద్వారా జిల్లాలోని 33 గ్రామాల్లో మిడతలు వచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏ రోజుకుకారోజు గాలిని బట్టి కూడా పరిస్థితులు మారవచ్చని చెబుతోంది. ప్రస్తుత గాలివాటం ప్రకారం మిడతల దండు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోందని ఆ శాఖ పేర్కొంది. ఈ ప్రకారంగా డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్లు ఇప్పటికే సంబంధిత ఆఫీసర్లను అలర్ట్ చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న వనరులు, సామగ్రిలతో నివేదికలు తయారు చేయించింది. మరోవైపు గ్రామాలు, మండలాల వారీగా గ్రూప్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరిహద్దులోని పంటల సరళిపై ఇప్పటికే నివేదికలూ రూపొందించారు.

ముందస్తు జాగ్రత్తలు ఇలా…

అధికారులు సూక్ష్మ స్థాయిలో ముందస్తు చర్యలు చేపడుతున్నారు.  గ్రామాల వారీగా ఇన్వెంటరీ తయారు చేసుకోవడం, హ్యాండ్ స్ప్రేయర్లు, జెట్టి మిషన్స్, రసాయనాలు, ఫైరింజన్ వాహనాలు, రసాయనాల స్ప్రే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లను అందుబాటులో ఉంచింది. 33 గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు, ఏఈవోలు, వీఆర్వోలు, ఫైర్‌‌ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల జాబితా మ్యాప్ లను  రెడీగా ఉంచారు.

ఈ ఊళ్లకే ముప్పు..

సంగారెడ్డి జిల్లాలో 33 గ్రామాల్లో మిడతల దండు అటాక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో కర్ణాటక సరిహద్దు గ్రామాలైన నాగల్ గిద్ద  మండలంలో ఔదత్ పూర్, గొడేగావ్ వాడ, కరస్ గుత్తి, ఏస్గీ, కారముంగి, షాపూర్, శాంతి నగర్ తండా, మొర్గి, కంగ్తి మండలం దేగుల్ వాడి, చందర్ తండా, సిద్ధన్ గిర్గా, నాగూర్ కె, బాబుల్ గావ్, జహీరాబాద్ డివిజన్ లో మొగుడంపల్లి  మండలం గౌసాబాద్ తండా, ధనశ్రీ, మాడిగీ, జాడి మల్కాపూర్, ఔరంగానగర్, జహీరాబాద్ మండలం సత్వార్, చిరాగ్ పల్లి, బుర్ధిపాడ్, బుచినెల్లి, కోహిర్ మండలం సిద్దాపూర్ తండ, మనియార్ పల్లి, న్యాల్కల్ మండలం శంషల్లాపూర్, రాజోల, మాలీగి, హుస్సేన్ నగర్, కల్బెమల్, డప్పూర్, రత్నాపూర్, హూసెళ్లి, గణేశ్‌పూర్ గ్రామాలకు మిడతల దండు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనాలు వేస్తున్నారు. ఈ  గ్రామాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు ఆఫీసర్లకు సూచించారు.

దేగుల్ వాడిలో హై అలర్ట్

మీరు చూస్తున్న ఈ చిత్రం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దేగుల్ వాడి గ్రామం. ఇక్కడ చాలా వరకు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారే ఎక్కువ. కర్ణాటక బార్డర్‌‌కు ఈ ఊరికి మూడు కిలోమీటర్లు ఉండగా, మహారాష్ట్ర బార్డర్ 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గ్రామంలోకి మిడతల దండు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు ఊళ్లో చాటింపు వేయించారు. ఈ గ్రామంలో తిరుగుతూ పల్లె జనాన్ని చైతన్య పరుస్తున్నారు. నాలుగు రోజులుగా ముందు జాగ్రత్తలపై ఆఫీసర్లు హడావుడి చేస్తుండడంతో గ్రామస్తుల్లో భయాందోళన మొదలైంది.