నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ పట్టణం ఈదుల గూడ చౌరస్తా దగ్గర సిఎంట్ ట్యాంకర్ ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
శుక్రవారం(జనవరి 09) తెల్లవారు జామున నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా దగ్గర సిమెంట్ ట్యాంకర్ (రెడీమిక్స్)ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి గుంటూరు కు టైల్స్ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం ఈదులగూడ చౌరస్తా దగ్గర మలుపు తిరుగుతున్న రెడీమిక్స్ సిమెంట్ ట్యాంకర్ ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం లో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడివున్న డీసీఎంను క్రేన్ సహాయంతో తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు.
